ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ గింజల్ని నీటిలో మరిగించి తాగండి.. షుగర్ తగ్గడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Dec 30, 2024, 11:34 PM

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అనేది అతి పెద్ద ముప్పుగా మారింది. డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది ఈ మహమ్మారితో బాధపడుతున్నారు. డయాబెటిస్‌, ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది లేదా ఆగిపోతుంది. దీని కారణంగా రక్తంలో షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఇది సకాలంలో నియంత్రించబడకపోతే, ఈ వ్యాధి శరీరంలోని అనేక ప్రధాన అవయవాలను దెబ్బతీస్తుంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, మధుమేహం నయం చేయలేని వ్యాధి. దీనికి శాశ్వత చికిత్స అందుబాటులో లేదు. మందులు, ఆహారం ,జీవనశైలి మార్పుల ద్వారా మాత్రమే దీనిని నియంత్రించవచ్చు. అంతేకాకుండా కొన్ని ఇంటి చిట్కాల సాయంతో రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించవచ్చు.


డయాబెటిస్ వచ్చిన వారి రక్తంలో షుగర్ లెవల్స్ హెచ్చు తగ్గులకు గురవుతాయి. దీంతో శరీర కణాలకు శక్తి అందక అలసటగా అనిపిస్తుంది. డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే, జీవితాంతం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు చేయాలి. కొన్ని ఇంటి చిట్కాల్ని పాటించడం ద్వారా కూడా షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. సోంపు గింజలతో షుగర్‌ లెవల్స్ కంట్రోల్ చేయవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.


సోంపు గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు..


​సోంపు.. ఇది రుచి, వాసనకు ఫేమస్. చాలా మంది భోజనం చేసిన తర్వాత సోంపు తింటుంటారు. ఇది నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. ఇది మంచి నేచురల్ మౌత్ ఫ్రెషన‌ర్. అంతేకాకుండా ఆహారం సులభంగా జీర్ణమవ్వడానికి సాయపడుతుంది. సోంపులో అనేక పోషకాలు ఉన్నాయి. సోంపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కడుపు సమస్యల్ని తగ్గించడంలో సాయపడతాయి. కడుపులోని చెత్తను బయటకు పంపించడంలో సాయపడుతుంది. సోంపులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుతాయి. దీంతో.. రోగాలన్ని తట్టుకునే శక్తి వస్తుంది.


సోంపుతో రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్..


డయాబెటిక్ రోగులకు సోంపు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సోంపులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సాయపడతాయి. సోంపు గింజల్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో.. మధుమేహ రోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. సోంపు గింజల్ని రెగ్యులర్‌గా వాడితే.. మధుమేహాన్ని చాలా వరకు నియంత్రించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.


సోంపు గింజల్ని ఎలా తీసుకోవాలి?


రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచడానికి సోంపు గింజల వాటర్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక గ్లాస్ నీరు తీసుకుని వేడి చేయండి. ఆ తర్వాత ఒక చెంచా సోంపు గింజలు వేసి సుమారు 5-7 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని ఫిల్టర్ చేసి తాగండి. రోజూ రాత్రి పడుకునే ముందు సోంపు గింజల నీరు తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి రోజూ ఈ గింజల నీరు క్రమం తప్పకుండా తీసుకోవడం డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది.


సోంపు గింజల నీరు తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు..


* ఈ గింజల నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది.


* ఫెన్నెల్ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.


* సోంపు గింజల నీరు తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది .


* ఫెన్నెల్ వాటర్ తాగడం వల్ల శరీరంలో రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.


పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు..


సోంపు పాలు తాగినా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందుకోసం ముందుగా ఒక గ్లాస్ పాలు తీసుకోండి. ఇందులో.. కొంచెం నీళ్లు కలపండి. ఈ రెండింటిని కాసేపు మరిగించండి. పాలు మరగడం ప్రారంభమైన తర్వాత ఒక చెంచా సోంపు గింజల్ని కలపండి. ఆ తర్వాత పది నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఆ తర్వాత పాలను కాసేపు చల్లారనివ్వాలి. గోరు వెచ్చగా తాగితే మంచి ఫలితాలుంటాయి. ఉదయాన్నే బ్రే‌క్‌ఫాస్ట్‌లో ఈ పాలును భాగం చేసుకోండి. చలికాలంలో ఈ సోంపు పాలు రోజు తాగితే శరీరానికి తక్షణ శక్తి రావడమే కాకుండా.. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa