గత నవంబర్లో నిర్వహించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ఈ నెల 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇటీవలె అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ మృతి చెందిన విషయం తెలిసిందే. జిమ్మి కార్టర్ మృతికి సంతాపంగా ఇప్పటికే ప్రస్తుతం అధికారంలో ఉన్న జో బైడెన్ నేతృత్వంలోని డెమోక్రాటిక్ ప్రభుత్వం.. 30 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఈ 30 రోజుల పాటు అమెరికా జాతీయ జెండాను అవనతం చేయనున్నారు. అంటే సగం వరకు మాత్రమే జెండాను ఎగురవేస్తారు. అయితే ఈ 30 రోజులలోనే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాను బాధ్యతలు తీసుకునే సమయంలో జాతీయ జెండా సగం వరకే ఎగురవేసి ఉండటం అమెరికావాసులకు నచ్చడం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో జాతీయజెండా అవనతం చేసి ఉండడాన్ని బైడెన్ కార్యవర్గం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నారని మండిపడ్డారు. ఎందుకంటే నిజానికి వారికి దేశం అంటే ప్రేమ లేదని పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి కారణంగా.. అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం సమయంలో జాతీయ జెండా అవనతమై ఉండటం ఇదే తొలిసారి కావచ్చని తెలిపారు. దీన్ని ఎవరూ ఆమోదించరని.. ఈ నిర్ణయంపై ఏ అమెరికన్ పౌరుడు కూడా సంతోషంగా లేరని ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఇక వైట్హౌస్ మాత్రం.. జిమ్మీ కార్టర్ మృతి సందర్భంగా ప్రకటించిన సంతాప దినాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన లేదని వైట్హౌస్ ప్రతినిధి కరీన్ జిన్ పియర్ స్పష్టం చేశారు. మరోవైపు.. జనవరి 20వ తేదీన అమెరికా 44వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఇటీవల జిమ్మీ కార్టర్ అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్లో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు జేమ్స్ ఇ.కార్టర్ 3 వెల్లడించారు. 1977-1981 మధ్య కాలంలో అమెరికాకు 39వ అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ పని చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa