విశాఖపట్నం బహిరంగ సభలో సీఎం నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ వేదికగా ఆంధ్రప్రదేశ్లో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఇన్ని లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన రోజును తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు.
"ఈ రోజు మన రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయే రోజు. ప్రధాని మోదీ చేతుల మీదుగా 2 లక్షల 8 వేల 545 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం. ఇలాంటి రోజు నా జీవితంలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో తొలిసారి.1.85 లక్షల కోట్ల పెట్టుబడితో పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్. విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వేజోన్. ఐదేళ్లు భూమి ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. విశాఖపట్నం రైల్వే జోన్ పనులు ఈ రోజు ప్రారంభమయ్యాయి. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, క్రిష్ సిటీ నిర్మాణం, ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన, మూడు రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, ఏడు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం ఇవన్నీ ఈ రోజు జరిగాయి" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 93 శాతం స్ట్రైక్ రేట్తో విజయం సాధించిందన్న చంద్రబాబు.. భవిష్యత్తులోనూ ఈ కాంబినేషన్ ఇలాగే కొనసాగుతుందన్నారు. దేశ రాజకీయాల్లో మోదీ హవా కొనసాగుతుందని.. ఆయన ప్రధానిగా ఉంటారన్న చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయం కావాలంటే రాసిపెట్టుకోవాలన్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థను బలమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు మోదీ మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలు తీసుకువచ్చారన్నారు.
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అమరావతికి రావాల్సిందిగా నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. అమరావతి రాజధాని ప్రాంతానికి గతంలో నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఓసారి అమరావతిని సందర్శించాలని నారా చంద్రబాబు నాయుడు కోరారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాలని కోరారు. మోదీని స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నామన్న చంద్రబాబు.. కేంద్రం సాయంతో నిలదొక్కుకున్నామని.. సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa