ఎవరో తెలియని వ్యక్తి నుంచి మన అకౌంట్లో డబ్బులు పడతాయి. ఆ మెసేజ్ చూసి మనం అవాక్కవుతాం. వెంటనే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లేదా బ్యాంక్ యాప్స్ ఓపెన్ చేసి.. మన అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేస్తాం. అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసేందుకు పిన్ నంబర్ ఎంటర్ చేయగానే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అప్పటివరకు మన అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది. ఇదే జంప్డ్ డిపాజిట్ స్కామ్. అయితే ఇలాంటి సైబర్ నేరాలు ఎక్కువ అవుతుండటంతో.. సైబర్ నిపుణులు, పోలీసులు, ప్రముఖులు ఇలాంటి స్కామ్ల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. ఈ జంప్డ్ డిపాజిట్ స్కామ్ గురించి అవగాహన కల్పించే ఒక వీడియోను షేర్ చేశారు.
సాధారణంగా మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడినా, విత్ డ్రా చేసినా ఆ అకౌంట్కు లింక్ అయిన సెల్ఫోన్కు మెసేజ్ వస్తుంది. ఇలా ఎవరైనా తెలియని నంబర్ల నుంచి మనకు డబ్బులు పడితే.. అవి ఎవరు వేశారు అనే ఆత్రుతతో మనం వెంటనే బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేస్తూ ఉంటాం. అయితే ఇదే ఎరగా వేసి సైబర్ నేరగాళ్లు మరో కొత్త పన్నాగం పన్నుతున్నారు. ఇలా తెలియని వారి ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేసి.. ఆ తర్వాత వారి అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని కొట్టేసే సరికొత్త రకమైన మోసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో అందరూ ఈ Jumped deposit scam తో జాగ్రత్త అంటూ ప్రజలకు సూచిస్తున్నారు.
దీనిపై తాజాగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఎవరో తెలియని అజ్ఞాత వ్యక్తుల యూపీఐ వ్యాలెట్ నుంచి మన బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వస్తే తెగ సంబరపడిపోకండి అంటూ ఆయన సూచించారు. ఖాతాలో డబ్బులు పడ్డాయనే సంతోషంతో బ్యాలెన్స్ చెక్ చేసేందుకు పిన్ నంబర్ ఎంటర్ చేశారో.. మీ ఖాతా గుల్ల అవుతుందని పేర్కొన్నారు. బ్యాలెన్స్ చెక్ చేసే సమయంలోనే యూపీఐ ఐడీలకు పేమెంట్స్ లింక్లను పంపించి సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచేస్తేన్నారని సజ్జనార్ వివరించారు. ఇలాంటి ఫేక్ పేమెంట్స్ లింక్లు వస్తే వాటికి అస్సలు స్పందించొద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఎవరైనా తెలియక సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబరుకు కాల్ చేసి సైబర్ ఫిర్యాదులు చేయాలని హితవు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa