సాగరతీరం విశాఖ.. మరింత అందాన్ని, సౌకర్యాలను సంతరించుకోనుంది. అద్భుతమైన సాగరతీరం, పర్యాటక ప్రాంతాలతో విశాఖపట్నం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అలాగే పలు కీలక ప్రాజెక్టులకు కూడా విశాఖపట్నం కేంద్ర బిందువుగా మారింది. టీసీఎస్, లులూ వంటి సంస్థలతో పాటుగా మరిన్ని కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో ఇటు పర్యాటకంగానే కాకుండా.. అటు పారిశ్రామిక రంగంలోనూ వైజాగ్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదే పదే చెప్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగానే విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ సైతం కొత్త ప్రాజెక్టులు చేపట్టింది. వీటిని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది.
వీఎంఆర్డీఏ చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. మల్టీ లెవల్ కార్ పార్కింగ్. 80 కోట్ల రూపాయల వ్యయంతో ఈ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టు చేపట్టారు. విశాఖపట్నంలో పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు ఈ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ నిర్మాణానికి పూనుకున్నారు. 11 అంతస్తులో ఈ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణం చేపట్టారు. ఇందులో ఆరు అంతస్తులను పార్కింగ్ కోసం కేటాయించారు. ఈ ఆరు అంతస్తుల పార్కింగ్ స్థలంలో 600 కార్లు, 800 ద్విచక్రవాహనాలను ఒకేసారి పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసారు. అలాగే మిగతా ఐదు అంతస్తులను ఐటీ, ఇతరత్రా కంపెనీలకు కేటాయించాలని నిర్ణయించారు.
మరోవైపు విశాఖ వచ్చే పర్యాటకులను ఆకర్షించే మరో ప్రాంతం కైలాసగిరి. ఇక్కడ గ్లాస్ స్కై వాక్ నిర్మించాలని వీఎంఆర్డీఏ సంకల్పించింది. ఐదు కోట్ల వ్యయంతో కైలాసగిరి గ్లాస్ స్కైవాక్ నిర్మాణం చేపట్టారు. కైలాసగిరిపై పర్యాటకులకు సరికొత్త అనుభూతి పంచేందుకు దీనిని ఏర్పాటు చేస్తున్నారు. 100 మీటర్ల మేర ఈ గ్లాస్ స్కైవాక్ మీద పర్యాటకులు నడిచే విధంగా దీని నిర్మాణం జరుగుతోంది.
ఇక ఇప్పటికే స్కైసైక్లింగ్, జిప్ లైనర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాగే మరో రూ. 5 కోట్ల వ్యయంతో విశాఖపట్నం బీచ్ రోడ్డులో యుద్ధ హెలికాప్టర్ను మ్యూజియం తరహాలో మారుస్తున్నారు. సీహారియర్ మ్యూజియానికి సమీపంలో నేవీకి చెందిన యూహెచ్-3హెచ్ యుద్ధ హెలికాఫ్టర్ను మ్యూజియం తరహాలో మారుస్తున్నారు. వీటితో పాటుగా రూ.500 కోట్లతో రుషికొండ వద్ద అర్బన్ హేబిటేట్ సెంటర్, రూ.8 కోట్లతో బీచ్ రోడ్డులో ఓషన్ డెక్ వంటి ప్రాజెక్టులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa