తెలుగు రాష్ట్రాలే ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ప్రైవేట్ సెక్టార్కు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ హెరిటేజ్ ఫుడ్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవస్థాపకులుగా ఉన్న ఈ కంపెనీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్- డిసెంబర్ (Q3) త్రైమాసికానికి సంబంధించి తాజాగా జనవరి 22న ఫలితాలు వెల్లడించింది. స్టాక్ మార్కెట్ ముగింపు గంటల వేళ ప్రకటించిన ఫలితాల్లో దుమ్మురేపింది. సమీక్షా త్రైమాసికంలో 3 నెలల కాలంలో హెరిటేజ్ ఫుడ్స్ నికర లాభం రూ. 43.05 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోల్చి చూస్తే లాభం ఏకంగా 60 శాతం పెరగడం విశేషం. అప్పుడు లాభం రూ. 27 కోట్లుగానే ఉండేది. అయితే దీనికి ముందు త్రైమాసికం అంటే జులై- సెప్టెంబరులో లాభం రూ. 48.62 కోట్లుగా ఉంది. కిదంటి త్రైమాసికంతో చూస్తే ఇక్కడ లాభం తగ్గిందన్నమాట.
ఇక డిసెంబరుతో ముగిసిన క్వార్టర్లో సంస్థ కార్యకలాపాల ఆదాయం 10 శాతం మేర పెరిగి రూ. 1033.93 కోట్లకు చేరింది. ఇక్కడ ఆదాయం కిందటి త్రైమాసికంతో పోలిస్తే పెరిగింది. క్యూ2లో రూ. 1019.52 కోట్ల మేర ఆదాయం నమోదు చేసింది. కంపెనీ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ సెగ్మెంట్లో ఆదాయం 17.6 శాతం మేర వృద్ధి చెందినట్లు కంపెనీ ఎక్స్చేంజీ ఫైలింగ్లో వెల్లడించింది. ఇదే రూ. 287.4 కోట్లుగా నమోదైంది.
ఈ క్రమంలోనే మెరుగైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో స్టాక్ ఒక్కసారిగా పుంజుకుంది. ఫలితాలకు ముందు స్టాక్ భారీగా పడిపోవడం గమనార్హం. కిందటి సెషన్లో రూ. 441.85 వద్ద ముగిసిన స్టాక్ ఇవాళ ఆరంభంలో మార్కెట్లు ఒడుదొడుకుల్లో ఉన్న సమయంలో దాదాపు 4 శాతానికిపైగా తగ్గి రూ. 421.85 వద్ద కనిష్టాన్ని తాకింది. ఇక ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడా తగ్గకుండా దూసుకెళ్లడం విశేషం. మళ్లీ దాదాపు 4 శాతానికిపైగా పెరిగి రూ. 461.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకి చివరకు 2.57 శాతం లాభంతో రూ. 453.20 వద్ద స్థిరపడింది.
చివరకు కంపెనీ మార్కెట్ విలువ రూ. 4.21 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 727.35 కాగా.. కనిష్ట ధర రూ. 296. 40 వద్ద ఉంది. గతేడాది బడ్జెట్ సమయంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఘనవిజయం సాధించిన సమయంలో ఈ స్టాక్ భారీగా పుంజుకోగా ఇటీవల పడిపోతూ వస్తోంది. నెల వ్యవధిలో 3 శాతానికిపైగా పడిపోగా.. 6 నెలల్లో 17 శాతానికిపైగా పతనమైంది. ఏడాది వ్యవధిలో మాత్రం 45 శాతానికిపైగా పెరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు.. ఈ సంస్థ ఫౌండర్ కాగా.. ఆయన సతీమణి నారా భువనేశ్వరి వైస్ ఛైర్పర్సన్, ఎండీగా ఉన్నారు. ఆయన కోడలు నారా బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa