ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌పై.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 26, 2025, 07:10 PM

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌పై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బందిని హేతుబద్ధీకరించాలని ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో కొన్నిచోట్ల సిబ్బంది ఎక్కువగా ఉండగా.. మరి కొన్నిచోట్ల తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆమోదం తెలిపింది. తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ప్రభుత్వ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.


గత వైసీపీ హయాంలో 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. వీటిలో పనిచేసేందుకు మొత్తం 1,30,694 మంది ఉద్యోగులను నియమించారు. అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఒక్కోచోట ఎక్కువగా, మరో చోట తక్కువగా ఉన్నారనే కారణంతో రేషనలైజేషన్ చేపట్టాలని టీడీపీ కూటమి సర్కారు నిర్ణయించింది. అందులో భాగంగానే జనాభా ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయాలకు ఉద్యోగులను కేటాయించనున్నారు. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించారు.


2,500 మంది వరకూ జనాభా ఉన్న సచివాలయాలను ఏ కేటగిరీ కింద చేర్చిన ప్రభుత్వం.. ఈ సచివాలయాలకు ఆరుగురు ఉద్యోగులను కేటాయించనుంది. 2,500 నుంచి 3500 మంది జనాభా ఉన్న సచివాలయాలకు బి కేటగిరి కిందకు చేర్చారు. ఇలాంటి సచివాలయాలకు 7 మంది ఉద్యోగులను కేటాయించనున్నారు. 3,500 కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న స‌చివాల‌యాల‌ను సీ కేటగిరీ కిందకు చేర్చిన ప్రభుత్వం.. ఇలాంటి సచివాలయాలకు 8 మంది ఉద్యోగులను కేటాయించనుంది. సచివాలయాల పరిధిలోని జనాభా, ఆర్థిక కార్యకలాపాలు, పనిభారం వంటి కారణాలతో ఉద్యోగుల సంఖ్య పెరగవచ్చని తెలిపింది.


మరోవైపు ఉద్యోగులను కూడా మల్టీపర్పస్‌ ఫంక్షనరీలు, టెక్నికల్, ఆస్పిరేషనల్‌ ఫంక్షనరీలు అంటూ ప్రభుత్వం మూడు విభాగాలుగా విభజించింది. వీరిని జనాభా ఆధారంగా సచివాలయాలకు కేటాయించనున్నారు. అలాగే గ్రామ సచివాలయాలకు పంచాయతీ కార్యదర్శులు, వార్డు సచివాలయాల విషయానికి వస్తే వార్డు పరిపాలన కార్యదర్శులు అధిపతులుగా ఉంటారని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa