ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన రథసప్తమి ఉత్సవాలను దేశం మెచ్చేలా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో జరగనున్న రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను, నగర సుందరీకరణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘డివైడర్ల మధ్యలో పచ్చదనం ఉండేలా చూడాలి. ముందుగానే విద్యుత్తు స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేయాలి. ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 4.5 కిలోమీటర్ల మేర నిర్వహించనున్న ఆదిత్యుని శోభాయాత్రను తిరుపతిలో జరిగే గరుడసేవ మాదిరిగా నిర్వహించాలి.
ఈ శోభాయాత్రకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. నగరంలోని 5 ముఖ్య కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్ర భవిష్యత్తుకు అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయం మూలం కానుంది.’ అని తెలిపారు. అనంతరం క్యూలైన్లు, భక్తులకు సౌకర్యాలు, పాసుల జారీ, టిక్కెట్ల విక్రయాలు, తదితర అంశాలపై ఆలయ అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో సాయి ప్రత్యూష, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, ఎస్ఈ సుగుణాకరరావు, డీపీవో భారతి సౌజన్య, ఆలయ ఈవో భద్రాజీ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa