విశాఖపట్నం జిల్లా, పెదబయలు మండలంలోని రూఢకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల గిన్నెలకోట పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో చిన్నారులకు ప్రబలుతున్న వైరస్ను అరికట్టేందుకు వైద్య శాఖ పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతోంది. ఈ మేరకు మంగళవారం రూఢకోట పరిధి వైద్యుడు సత్యారావు ఆధ్వర్యంలో గిన్నెలకోట పంచాయతీలోని చింతగరువు, తమలం, గండలం, ఇనుపతీగల,మెట్టగూడ గ్రామాల్లో ఐదు వైద్య బృందాలతో ఇంటింటికి వెళ్లి బాలల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. కొన్ని గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. గ్రామాల్లో మందులు వాడుతున్న చిన్నారులకు వ్యాధి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతున్నదని వైద్యుడు సత్యారావు తెలిపారు. పంచాయతీ పరిధిలో పగలు, రాత్రి తేడా లేకుండా వైద్య సిబ్బందితో పర్యవేక్షిస్తున్నట్టు ఆయన చెప్పారు. గాలి ద్వారా ప్రబలిన వ్యాధి తీవ్రత తగ్గుతున్నదని, గత రెండు రోజుల్లో కొత్త కేసులు ఎక్కడా నమోదు కాలేదని తెలిపారు. అలాగే పాడేరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిలో ఒకరిని మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కి తరలించామన్నారు. మిగతా వారి పరిస్థితి గతంలో కన్నా మెరుగ్గా ఉందని, వారందరినీ త్వరలో ఇళ్లకు పంపుతామన్నారు. సకాలంలో బాలలకు అందించవలసిన వ్యాఽధి నిరోధక టీకా(ఎమ్ఆర్) వేయడం వల్ల ఈ వైరస్ ప్రభావం తగ్గిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్వో బింగురాజు, హెచ్వీ కాసులమ్మ, ఎంపీహెచ్ఏ చిట్టిబాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa