నంద్యాల జిల్లా చాపిరేవులలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. నంద్యాల జిల్లా చాపిరేవులలోని ఫరూక్నగర్లో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం.. లింగమయ్య, సుబ్బరాయుడు అనే ఇద్దరు వ్యక్తులు అన్నదమ్ములు. రెండు కుటుంబాలు పక్కపక్క ఇళ్లలో ఉంటాయి. లింగమయ్య ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్నారు. సుబ్బరాయుడు బేల్దారి పనికి వెళ్తుంటారు. యధావిధిగా సోమవారం పనులకు వెళ్లిన ఆ రెండు కుటుంబాలు.. పనులు పూర్తి చేసుకుని వచ్చి, రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాయి. అయితే మంగళవారం తెల్లవారుజామున వారి జీవితంలో ఊహించని ఘటన జరిగింది.
మంగళవారం తెల్లవారుజామున లింగమయ్య ఇంట్లో సిలిండర్ నుంచి గ్యాస్ లీకైంది. ఇంట్లో ఏదో వాసన రావటంతో లింగమయ్య భార్య వెంకటేశ్వరి లేచారు. నిద్ర మత్తులో ఉండటంతో గ్యాస్ వాసన వచ్చినప్పుడు లైట్ ఆన్ చేయకూడదనే సంగతిని ఆమె మర్చిపోయారు. దీంతో వంటింట్లోకి వెళ్లిన వెంకటేశ్వరి లైట్ వేశారు. అప్పటికే గ్యాస్ లీకై విస్తరించి ఉండటంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. సిలిండర్ పేలుడు ధాటికి రెండిళ్లు దెబ్బతిన్నాయి. పేలుడు ఘటనలో సుబ్బరాయుడు కుమారుడు తొమ్మిదేళ్ల దినేష్ కుమార్ శిథిలాలు మీద పడటంతో చనిపోయారు. పేలుడు ధాటికి గోడ కూలడంతో ఇంటి బయట రేకుల షెడ్డులో నిద్రిస్తున్న సుబ్బరాయుడు తల్లి వెంకటమ్మ కూడా చనిపోయారు.
రెండిళ్లలో ఉన్న మిగతా ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంటలు అంటుకోవటంతో వారంతా బయటకు పరుగులు తీశారు. స్థానికులు విషయాన్ని గమనించి వెంటనే పోలీసులు, ఫైరింజన్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. దినేష్ కుమార్, వెంకటమ్మ మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa