ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్టా్త్మక కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. జనవరి 30వ తేదీ అంటే గురువారం నుంచే ఈ కార్యక్రమం మొదలు కానుంది. పౌరసేవలను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో జనవరి 30 నుంచి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమం ప్రారంభం కానుంది. దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించనుంది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించడంతో పాటుగా ప్రజల నుంచి వినతులు స్వీకరించడం, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేయనున్నారు.
వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం గతేడాదిలో మెటాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచే వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి తేవాలని ప్రయత్నించినా కుదరలేదు. తాజాగా బుధవారం వాట్సాప్ గవర్నెన్స్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం రేపటి నుంచే వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఇక తొలి విడతగా161 సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సేవలను ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ప్రారంభిస్తారు.
వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం ఒక వాట్సాప్ నంబర్ను ప్రకటించనుంది. ఈ వాట్సాప్ అకౌంట్కు వెరిఫైడ్ ట్యాగ్ కూడా ఉంటుంది. ఈ నంబరు ద్వారా వాట్సాప్ ఖాతాను ఉపయోగించి పౌర సేవలు పొందే అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతానికైతే తొలివిడతలో 161 సేవలు వాట్సాప్ ద్వారా అందిస్తారు. అందులో దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ సేవలు ఉంటాయి. అలాగే అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల సేవలు అందుబాటులో ఉంటాయి. విద్యుత్తు బిల్లులు, పన్నుల చెల్లింపుల వంటి సేవలతో పాటుగా దేవాలయాల్లో దర్శనాలు, వసతి గదుల బుకింగ్, విరాళాల సమర్పణకు ఇది ఉపయోగపడనుంది. అలాగే పర్యాటక ప్రదేశాల సమాచారం, టికెట్ బుకింగ్ వంటివి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈజీగా చేయొచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ రికార్డులు, ఆదాయ ధ్రువీకరణ వంటి సర్టిఫికెట్లు సులభంగా పొందొచ్చు.
పౌర సేవలతో పాటుగా ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడనుంది. ప్రకృతి విపత్తులు, భారీ వర్షాల సమయంలో ఈ వాట్సాప్ నంబర్ ద్వారా సమాచారం వేగంగా చేరవేయవచ్చని అధికారులు చెప్తున్నారు. ఫలితంగా వేగంగా వారిని అప్రమత్తం చేసే వీలుంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా ఈ వాట్సాప్ ఖాతా ద్వారా చేరవేయనున్నారు. సంక్షేమ పథకాలు, వాటి అర్హతలు గురించి ఈ వాట్సాప్ నంబర్కు సందేశం పంపడం ద్వారా పూర్తి వివరాలను ప్రజలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు.
ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించేందుకు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడనుంది. ప్రభుత్వానికి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఈ నంబరుకు మెసేజ్ పంపితే సరిపోతుంది. మెసేజ్ అనంతరం అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే మనకో రిఫరెన్స్ నంబర్ వస్తుంది. ఆ రెఫరెన్స్ నంబర్ ద్వారా మన ఫిర్యాదు, లేదా వినతి ఎక్కడ ఉందనే సమాచారాన్ని ట్రాక్ చేయవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa