ఏపీ ఎన్నికల సమయంలో మహిళల కోసం అనేక హామీలు ప్రకటించిన టీడీపీ కూటమి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా మహిళల కోసం మరో హామీని అమలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంపై ఫోకస్ పెట్టింది. ఈ విషయాన్ని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి మండిపల్లి చెప్పారు.
మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మండిపల్లి తెలిపారు. ఉచిత బస్సు పథకాన్ని విజయవంతంగా అమలుచేసేందుకు ఇప్పటికే అమలవుతున్న రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఉచిత బస్సు పథకం అమలవుతున్న కర్ణాటకలో ఇప్పటికే పర్యటించామన్న మంత్రి మండిపల్లి.. అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసినట్లు, కర్ణాటక రవాణాశాఖ అధికారులతో వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. త్వరలోనే ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఉగాది నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను తయారు చేసిందని.. ఈ రిపోర్టును ప్రభుత్వానికి అందించినట్లు తెలిపాయి. ఫిబ్రవరి ఆరో తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికపై ఏపీ ప్రభుత్వం చర్చిస్తుందని.. ఆ తర్వాత ఉగాది నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa