ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా దాదాపు 10 కోట్లకు పైగా భక్తులు కుంభమేళాకు చేరుకున్నారు. బ్రహ్మముహూర్తం నుంచే స్నానాలు చేయాలని భావించి కోట్లాది మంది ఘాట్లకు వద్దకు చేరుకోగా.. బుధవారం రోజు వేకువజామున 2 గంటలకు తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తంగా 30 మంది ప్రాణాలు కోల్పోగా.. 60 మందికి పైగా గాయపడినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
అయితే ఈ ఘటనపై స్పందించిన సమాద్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. యూపీ సర్కారు కావాలనే మృతుల సంఖ్యను దాచి పెడుతుందని అన్నారు. 30 మంది చనిపోయారని చెబుతున్నా.. అంతకంటే ఎక్కువ మందే ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నట్లు వివరించారు. ఒకవేళ తొక్కిసలాటలో ఎక్కువ మంది చనిపోయినట్లు ఒప్పుకుంటే.. మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాల్సి వస్తుందని వెల్లడించారు. ఆ నష్ట పరిహారాన్ని చెల్లించకుండా ఉండేందుకు సర్కారు ఈ ప్లాన్ వేసిందంటూ ఆరోపించారు.
యూపీ సర్కారుతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ నైతికంగా, రాజకీయంగా విఫలం అయ్యారని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ప్రభుత్వం మరణాల సంఖ్యను దాచి పెడుతుంది కాబట్టే వారికి పరిహారాన్ని కూడా ఇంకా ప్రకటించలేందటూ తెలిపారు. ప్రభుత్వం కేవలం ప్రజల దృష్టిని మరల్చాలనుకుంటుందని వ్యాఖ్యానించారు. కుంభమేళా తొక్కిసలాట వెనుక ఎలాంటి కుట్ర లేదని.. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం కారణంగానే సంభవించిందన్నారు. అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పచ్చి అబద్ధాల కోరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా ప్రమాదం జరిగిన దాదాపు 18 గంటల తర్వాత యూపీ సర్కారు మృతుల సంఖ్యను అధికారికంగా వెల్లడించిందని.. అప్పటి వరకు వారంతా ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా మృతుల కుటుంబాలకు వీలైనంత త్వరగా సమాచారం అందించాలని.. ప్రాణాలు కోల్పోయిన వారి జాబితాను బహిరంగంగా తెలపాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరు మహిళలు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోగా.. వారికి ఇంకా మరణ ధ్రువీకరణ పత్రాలు పొందలేరని ఎక్స్ వేదికగా వివరించారు.
మరణ ధ్రువీకరణ పత్రాలకు బదులుగా చిన్న కాగితం ముక్కలు ఇస్తూ.. మృతదేహాలను అందజేశారని మృతుల కుటుంబ సభ్యులు వెల్లడించారని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ అంశాలను లేవనెత్తుతానని తెలిపారు. వీఐపీ ట్రీట్మెంట్ వల్లే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని.. అయినా వాటిని ఉపయోగించుకుంటూ తాము రాజకీయం చేయాలనుకోవడం లేదని వెల్లడించారు. కాకపోతే ప్రజలకు సాయంగా నిలబడేందుకు న్యాయమైన విచారణ జరిపించాలని మాత్రమే కోరుతున్నామని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa