శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులకు కేటుగాళ్లు షాకులు మీద షాకులు ఇస్తున్నారు. భక్తులను నిలువునా దోచేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. తిరుమలలో ఇటీవల కాలంలో నకిలీ టికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఒకదాని తర్వాత మరో మోసం వెలుగు చూస్తూ ఆందోళన కలిగిస్తోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తిశ్రద్ధలతో ప్రజలు తిరుమలకు వెళ్తుంటారు. అయితే వారికి కొంత మంది కేటుగాళ్లు నకిలీ టికెట్లతో దర్శనం చేయిస్తున్నారు. వారి చేతుల్లో మోసపోతూ పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే స్వామివారి సన్నిధిలో మళ్లీ చోటు చేసుకుంది.
హైదరాబాద్ నగరానికి చెందిన ఉపేందర్ అనే భక్తుడు డోనర్ రెఫరెన్స్ టికెట్లతో శ్రీవారి దర్శనానికి వెళ్లాడు. అయితే వైకుంఠం-1లో వద్ద అతని టికెట్లు స్కాన్ అవ్వలేదు. దీంతో డోనర్ సెల్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని వైకుంఠం సిబ్బంది సూచించారు. అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయగా.. టికెట్లను పరిశీలించిన సిబ్బంది వాటిని నకిలీవిగా తేల్చారు. అయితే తాను మూడు టికెట్లకు గానూ రూ.21 వేలు ఖర్చు చేసినట్లు బాధితుడు ఉపేందర్ తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఇద్దరు దళారీల నుంచి ఈనెల 29న వాటిని కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చాడు. దీనిపై విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదుతో తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.