అనంతపురం జిల్లాలోని కల్లు గీత కార్మికులు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అనంతపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) రామమోహన్రెడ్డిపేర్కొన్నారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలోని తన చాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి ఐదో తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 7న కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో కలెక్టర్ సమక్షంలో లాటరీ తీస్తామన్నారు. జిల్లాలో 14 మద్యం షాపులను కల్లుగీత కార్మికులైన ఈడిగ, గౌడ్, గౌడ, గౌండ్ల, కళాలి కులస్థులకు కేటాయించినట్లు తెలిపారు.
ఈడిగకు 9, గౌడ్కు 2, గౌడ, గౌండ్ల, కళాలి కులస్థులకు ఒక్కొక్కటి చొప్పున దుకాణాలు కేటాయించామన్నారు. ఈడిగ కులస్థులు గుంతకల్లు, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలు, కంబదూరు, గుమ్మఘట్ట, గుంతకల్లు రూరల్, రాప్తాడు, బెళుగుప్ప మండలాల్లో దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.గౌడ్ కులస్థులు అనంతపురం నగర పాలక సంస్థ, గుత్తి రూరల్ మండలంలోని దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గౌడ రాయదుర్గం రూరల్, గౌండ్ల కులస్థులు డి.హీరేహాళ్, కళాలి కులస్థులు తాడిపత్రి మున్సిపాలిటీలోని దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని 10 ఎక్సైజ్ పోలీసు స్టేషన్లల్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. జిల్లాకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. దరఖాస్తుదారులు రూ.2 లక్షలు నాన్రిఫండబుల్ దరఖాస్తు ఫీజు చెల్లించాలన్నారు. కల్లుగీత కార్మికులకు మద్యం షాపుల లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీని ప్రభుత్వం కల్పించినట్లు వివరించారు.