కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కేంద్ర బడ్జెట్-2025ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం టర్మ్ లోన్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ. 2కోట్ల వరకు రుణాలు అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పథకం ద్వారా మొత్తం 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. తొలిసారి సొంత వ్యాపారాలను ప్రారంభించే, ఉన్న వ్యాపారాలను విస్తరించాలనుకునే మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుంది. అలాగే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మహిళలకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.