ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇది ప్రజల జేబులు నింపే బడ్జెట్.. ప్రధాని మోదీ ప్రశంసలు

national |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 08:25 PM

కేంద్రంలో వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వద్దకు స్వయంగా వెళ్లిన ప్రధాని మోదీ.. ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు. ఇక నిర్మలమ్మ బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్.. దేశంలోని 140 కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్ అని ప్రధాని కొనియాడారు. ఈ బడ్జెట్ కారణంగా దేశ ప్రజల్లో పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇక తాజాగా నిర్మలమ్మ ప్రవేశపెట్టిన ఈ పద్దు దేశాన్ని వికసిత్ భారత్‌ వైపు అడుగులు వేయిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత దేశ అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్‌ ఒక కీలక మైలురాయి అని అభివర్ణించారు. 140 కోట్ల మంది భారతీయుల కలలను నెరవేర్చే బడ్జెట్‌ అని ప్రశంసించారు. అంతేకాకుండా ఈ బడ్జెట్‌తో దేశంలోని అనేక రంగాల్లో యువతకు తమ ప్రభుత్వం భారీగా అవకాశాలు కల్పిస్తోందని వివరించారు.


సాధారణంగా బడ్జెట్‌లు.. ప్రభుత్వ ఖజానాను నింపడంపై దృష్టి సారిస్తాయని.. కానీ ఈ బడ్జెట్‌ మాత్రం ప్రజల జేబులు నింపేందుకు.. వారి పొదుపులను పెంచాలనే ఉద్దేశంతో తీసుకువచ్చినట్లు ప్రధాని స్పష్టం చేశారు.


 పార్లమెంటులో బడ్జెట్‌ ప్రసంగం తర్వాత నిర్మలమ్మను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. స్వయంగా తన సీటు నుంచి లేచి.. నిర్మలా సీతారామన్ వద్దకు వెళ్లి మరీ కృతజ్ఞతలు చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బడ్జెట్ చాలా బాగుందని.. అంతా ఆమెను ప్రశంసిస్తున్నారని.. నిర్మలతో మోదీ చెప్పినట్లు తెలుస్తోంది.


మరోవైపు.. నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయంలో.. మధ్యతరగతి ప్రజలకు ఎప్పుడూ చోటు ఉంటుందని పేర్కొన్నారు.


రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి ఇన్‌కమ్ ట్యాక్స్ లేదని తెలిపారు. ప్రతిపాదిత పన్ను మినహాయింపు ప్రకటన మధ్యతరగతి ప్రజల ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడానికి ఉపయోగపడుతుందని అమిత్ షా ట్వీట్‌ చేశారు.


.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com