కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్-2025-2026లో బిహార్ వాసులకు గుడ్న్యూస్లు వచ్చాయి. కేంద్ర బడ్జెట్లో బిహార్ వాసులకు శుభవార్తలు అందగా.. అది సోషల్ మీడియాలో మీమర్స్కు పండగలా మారింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ను బిహార్లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. మిథిలాంచల్లో 50 వేల హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చేలా పశ్చిమ కోసి కాల్వకు ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ రాష్ట్రానికి మఖానా బోర్డును ఇస్తున్నట్లు తెలిపింది. ఇవే కాకుండా ఐఐటీ పాట్నా విస్తరణ, పాట్నా ఎయిర్పోర్టు విస్తరణ.. బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.
ఇక కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. బిహార్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రోల్స్, మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక బడ్జెట్(Budget) లో B అంటే బిహార్ అంటూ నెటిజన్లు తెగ పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పదే పదే బిహార్ పేరును పలికారని నెటిజన్లు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన ఒక మీమ్ బాగా వైరల్ అవుతోంది. యానిమల్ సినిమాలో పాపా అని హీరో రణ్వీర్ కపూర్ 196 సార్లు అనగా.. బ్రహ్మాస్త్ర సినిమాలో హీరోయిన్ ఆలియా భట్ 83 సార్లు శివ అని జపించగా.. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ మాత్రం 537 సార్లు బిహార్ అని పలికారని నెటిజన్లు మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.
ఇక బడ్జెట్కు సంబంధించి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు సంబంధించిన కొన్ని మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మాటలు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు కానీ.. అవన్నీ తమ మాటలే అని నితీష్ కుమార్ అంటున్నట్లు అందులో ఉంది. ఇక కేంద్ర బడ్జెట్లో బిహార్కే అన్ని ప్రాజెక్టులు, కేటాయింపులు, నిధులు కేటాయించారని.. అదే సమయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పట్టించుకోలేదని మరికొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో మిగితా రాష్ట్రాలను వదిలేసి.. కేవలం బిహార్ పైనే ప్రేమ కురిపించారని పేర్కొంటూ నెటిజన్లు తెగ పోస్ట్లు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-2026 బడ్జెట్లో బిహార్కు వరాల జల్లు కురిసిందని.. శివాజీ సినిమాలో హీరో రజినీకాంత్ నడిచి వస్తుంటే.. ఆయన వెనకాల రోడ్లు, బిల్డింగ్లు సహా అన్నీ శరవేగంగా నిర్మించినట్లు ఉన్న వీడియోను వైరల్ చేస్తున్నారు. బడ్జెట్ తర్వాత బిహార్ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
మరోవైపు.. 2024 జులైలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ నరేంద్ర మోదీ సర్కార్ బిహార్పై ప్రత్యేక ప్రేమను కనబరించిందని అప్పట్లో సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ సాధించడంలో విఫలమైన బీజేపీ.. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ.. నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ మద్దతుతో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జులైలో బడ్జెట్ ప్రవేశపెట్టగా.. మొత్తంగా బిహార్కు రూ.60 వేల కోట్లకుపైగా ప్రాజెక్టులు, నిధులు, పవర్ ప్లాంట్, హెరిటేజ్ కారిడార్లు, ఎయిర్పోర్టులను కేంద్రం ప్రకటించింది.