ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైదానంలో గందరగోళం..కోహ్లీ వద్దకు దూసుకెళ్లిన ముగ్గురు ఫ్యాన్స్

sports |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 10:29 PM

భారత రన్ మెషీన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 12 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. రైల్వేస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ.. ఢిల్లీ తరఫున బరిలోకి దిగాడు. దిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. అతడిని చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌తో స్టేడియం నిండిపోయింది. అయితే అందుకు తగ్గట్లుగానే ఢిల్లీ క్రికెట్ సంఘం సైతం ఏర్పాట్లు చేసింది. పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ‘


ఎన్ని ఏర్పాట్లు చేసినా.. స్టేడియంలో భద్రతా వైఫల్యం కనిపించింది. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని మరీ కొందరు ఫ్యాన్స్.. విరాట్ కోహ్లీ కోసం మైదానంలోకి దూసుకొచ్చారు. శనివారం విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ చేస్తుండగా.. ముగ్గురు అభిమానులు అతడి వైపు పరిగెత్తుకుంటూ వెళ్లారు. విరాట్ పాదాలను తాకేందుకు యత్నించారు. దీంతో మైదానంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. వెంటనే గ్రౌండ్ సిబ్బంది, పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.


ఇక తొలి రోజు ఆటలోనూ ఓ అభిమాని మైదానంలోకి ప్రవేశించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఇలా ఫ్యాన్స్.. స్టేడియంలోకి దూసుకురావడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒకే మ్యాచ్‌లో రెండు సార్లు ఇలాంటి ఘటనలు జరగడమేంటని.. భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు రైల్వేస్‌పై ఇన్నింగ్స్‌ 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రైల్వేస్‌.. 241 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 374 పరుగులు చేసింది. ఆ తర్వాత 133 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన రైల్వేస్‌ 114 పరుగులకే కుప్పకూలింది. దీంతో విరాట్ కోహ్లీకి రెండో సారి బ్యాటింగ్‌ చేసే అవకాశం దక్కలేదు. తొలి ఇన్నింగ్స్‌లో అతడు 6 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. దీంతో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com