ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాళహస్తికి వచ్చే భక్తుల కోసం అనేక కీలక చర్యలు.. ఏపీ దేవాదాయశాఖ కీలక నిర్ణయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 02, 2025, 04:46 PM

మాఘమాసం ప్రారంభమైంది. మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పరమశివుడికి ఇదెంతో ప్రీతికరమైన మాసం కావటంతో భక్తులు శివాలయాలకు పోటెత్తుతుంటారు. నెలమొత్తం శివాలయాల్లో సందడి నెలకొంటూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శివాలయాల్లో శ్రీకాళహస్తి కూడా ఒకటి. శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుణ్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. అలాగే దేవస్థానం అధికారులు ఏటా.. ఈ మాసంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఏపీ దేవాదాయ శాఖ దృష్టి సారించింది.


శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 21 నుంచి 13 రోజుల పాటు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రపదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. శనివారం జరిగిన ఈ సమీక్షా సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించినట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.భక్తుల సౌకర్యార్థం అనేక చర్యలు, నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు.


శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. బ్రహ్మోత్సవ కమిటీతో భక్తుల వసతి, సేవలను పర్యవేక్షించనున్నట్లు మంత్రి వివరించారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుణ్ని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు అందరికీ ఉచితంగా లడ్డూలు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. బ్రహ్మోత్సవ బడ్జెట్‌ రూ.5 కోట్లతో ఆమోదం తెలిపారు. వీఐపీల కోసం ప్రత్యేక దర్శన వేళలు అమలు చేయాలని మంత్రులు, అధికారులు నిర్ణయించారు. వార్షిక బ్రహ్మోత్సవాలను డ్రోన్లు, 350 నుంచి 400 కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో దర్శనానికి వచ్చే మహిళలకు గాజులు, అమ్మవారి కుంకుమ ప్రసాదం, జాకెట్ అందించాలని నిర్ణయించారు.


అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చే భక్తుల వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. పట్టణ శివార్లలోని పార్కింగ్ స్థలాల నుంచి ఆలయానికి వచ్చేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు నీటిని ప్యాకెట్లలో కాకుండా సీసాలలో అందించాలని నిర్ణయించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అభ్యర్థన మేరకు శ్రీకాళహస్తి ప్రజలకు ఫిబ్రవరి 27న ఆలయంలో ఉచిత దర్శన సౌకర్యం కల్పించారు. ఆధార్ కార్డు ఆధారంగా వారికి ఉచితంగా దర్శనం కల్పించనున్నారు. ఇక చిన్నారులు తప్పిపోకుండా జియోట్యాగ్ చేయాలని మంత్రులు సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com