రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా ప్రతీ నెల ఒక్కో ప్రాంతానికి వెళ్లి పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి.. ఈ నెల అన్నమయ్య జిల్లా సంబేపల్లెలో పర్యటించారు. ఈ క్రమంలోనే ప్రజావేదిక వద్ద ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా.. ఎవరైనా ఐటీ ఉద్యోగులు ఉన్నారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించగా.. అందులో 40 మంది యువతీ యువకులు లేచి తాము సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిపారు. వారిని వేదికపైకి పిలిచిన సీఎం చంద్రబాబు.. పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఐటీ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నవారు.. వర్క్ ఫ్రమ్ హోం కోసం స్వస్థలాలకు వచ్చి పనిచేస్తున్నట్లు ఐటీ ఉద్యోగులు సీఎంకు వివరించారు.
ఈ సందర్భంగా వారికి మైక్ అందించిన చంద్రబాబు.. వారి అనుభవాలు పంచుకోవాలని సూచించారు. ఐటీ రంగంపై చంద్రబాబు దృష్టిపెట్టడంతోనే తాము సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నామని పలువురు వెల్లడించారు. అయితే కరోనా మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో ఇంటి వద్దే ఉంటూ.. ఓవైపు పనిచేసుకుంటూనే మరోవైపు.. తల్లిదండ్రులను చూసుకుంటున్నామని వివరించారు. ఉద్యాన పంటలు పండిస్తూ అదనపు ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నట్లు పలువురు ఐటీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. మరికొందరు ఐటీ ఉద్యోగంతో పాటు పొట్టేళ్ల పెంపకం చేస్తున్నామని చెప్పారు.
ఈ క్రమంలోనే ఆ ఐటీ ఉద్యోగుల మాటలు విన్న చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. వారి కోసం జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. గ్రామీణ యువతకు ఎంతో ఉపయోగకరంగా మారిన వర్క్ ఫ్రం హోం విధానాన్ని మరింత మెరుగ్గా ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. యువతకు స్కిల్స్ ఉంటే ఉద్యోగాలు వెతుక్కునే పరిస్థితి ఉండదని.. కంపెనీలే వెతుక్కుంటూ వస్తాయని సీఎం హితవు పలికారు. ఐటీ ఉద్యోగాలతో రాయలసీమ యువత రాష్ట్రానికి మంచి పేరు తీసుకువచ్చారని చంద్రబాబు ప్రశంసించారు.
ఏపీలో ఐటీ రంగాన్ని మరింత విస్తరించడానికి మంత్రి నారా లోకేష్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు. ప్రజల తలసరి ఆదాయం పెరిగేలా.. ప్రతీ సంవత్సరం 15 శాతం వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు చేస్తున్నామని వివరించారు. ఏపీలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని.. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామికవాడల్లో భారీగా ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ టెక్నాలజీ వినియోగంలో నైపుణ్యం సాధించాలని పేర్కొన్నారు.
ఒకప్పుడు ప్రజల వద్దకు పాలన సాగిస్తే.. ప్రస్తుతం ప్రజల చేతుల్లోకి పాలన వచ్చిందని.. వాట్సాప్ గవర్నెన్స్ను తీసుకువచ్చి విప్లవాత్మక మార్పుకు నాంది పలికినట్లు చెప్పారు. అంతేకాకుండా ఏపీలోని 5 ప్రాంతాల్లో టాటా ఇన్నోవేషన్ హబ్లను ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు గోదావరి నీటిని తరలించే ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa