144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తుల తాకిడి భారీగా పెరుగుతోంది. కోట్లాది మంది భక్తులు నిత్యం.. ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని మహా కుంభ్నగర్ గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే చోట త్రివేణి సంగమంలో కోట్లాది మంది భక్తులు నిత్యం పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళాకు గత 20 రోజుల్లో ఏకంగా 33.6 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. శనివారం రోజున 2.5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే సోమవారం.. వసంత పంచమి సందర్భంగా 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక ఇటీవలె మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో యూపీ సర్కార్ పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి చిన్న తప్పిదాలకు కూడా తావులేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. సీనియర్ ఐఏఎస్ అధికారులను రంగంలోకి దింపింది.
జనవరి 13వ తేదీన కుంభమేళా ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 1వ తేదీ వరకు సుమారు 33 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. శనివారం నాడు 2.15 కోట్ల మంది రాగా.. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకే.. 90 లక్షల మంది స్నానాలు చేసినట్లు తెలిపింది. మరోవైపు.. మహా కుంభమేళాకు వచ్చే సెలబ్రిటీలు కూడా భారీగా వస్తున్నారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే కుంభమేళాకు వచ్చివెళ్లారు. ఇక ఈనెల 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని రాక కోసం యూపీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటీవల ఒక్కరోజే కోట్లాది మంది ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు చేసేందుకు రావడంతో సెక్టార్ 2లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయిన నేపథ్యంలో భారీగా వస్తున్న భక్తుల రద్దీని నియంత్రించడంపై అధికారులు మరింత దృష్టి సారించారు. ఈ క్రమంలోనే 2019లో అర్ధ కుంభమేళా సమయంలో అక్కడ పనిచేసిన ఐఏఎస్ అధికారులు అశీష్ గోయల్, భానుచంద్ర గోస్వామిలను రంగంలోకి దించారు. కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్తో కలిసి వారిద్దరు పని చేయనున్నారు.
మరోవైపు.. అడిషనల్ డీజీపీ భాను భాస్కర్ కూడా భక్తుల రద్దీ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కుంభమేళా సందర్భంగా వచ్చే సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమిలను పవిత్రమైన రోజులుగా భావిస్తారు. వీటితోపాటు ఫిబ్రవరి 12వ తేదీన మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి పండగ సందర్భంగా అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.