కర్ణాటకలోని చిక్ మంగళూరు నుంచి అనంతపురం జిల్లా యాడికి మండలంలోని సిమెంట్ ఫ్యాక్టరీకి ఐరన్ లోడుతో కంటైనర్ రాత్రి 11 గంటలకు బయలుదేరింది. వాహనం నడుపుతోన్న డ్రైవర్ ఫరూక్2కు అడ్రస్ తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్స్పై ఆధారపడ్డాడు. తన మొబైల్ ఫోన్లో గూగుల్ మ్యాప్ పెట్టుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. తాను చేరాల్సిన గమ్యానికి వెళ్తున్నానని అనుకున్నాడు. కానీ, నేవిగేషన్ తప్పుగా చూపించడంతో కంటెయినర్ కొండల్లోకి వెళ్లింది. యాడికి మండలంలోని రామన్న గుడిసెలు సమీపానికి చేరాడు. అక్కడ లారీ అదుపుతప్పి గోతిలో ఇరుక్కుపోయింది. రాత్రిపూట కావడంతో చుట్టూచిమ్మచీకట్లలో భయం భయంగా కంటెయినర్లోనే గడిపాడు. ఉదయాన్నే స్థానికుల అక్కడకు వచ్చి సాయం చేయడంతో బతుకుజీవుడా అంటూ బయటపడ్డాడు.
ఇక, 2023 అక్టోబరు 1న భారీ వర్షాలు కురుస్తుండగా.. ఐదుగురు స్నేహితులు కారులో వెళ్తున్నారు. రాత్రివేళ కావడంతో వారు గూగుల్ మ్యాప్ ఆధారంగా గమ్యాన్ని చేరుకోవాలని భావించారు. మ్యాప్ తిన్నగా కోచి సమీపంలోని పెరియార్(Periyar) నదిలోకి తీసుకెళ్లింది. దీంతో కారు నదిలో పడి అందులోని ఇద్దరు డాక్టర్లు మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో కోచిలోని ప్రయివేట్ ఆసుపత్రిలో పనిచేస్తోన్న యువ వైద్యులు అద్వైత్(29), అజ్మల్(29)లు ప్రాణాలు కోల్పోయారు. ఎడమవైపునకు తిరగాలని గూగుల్ మ్యాప్ సూచించడంతో.. కారు అటుగా వెళ్లి నీట మునిగింది.
ఇక, గతేడాది డిసెంబరులో చెన్నైకు చెందిన ఓ డాక్టర్ దంపతులు తమ నాలుగు నెలల చిన్నారితో కారులో వెళ్తూ గూగుల్ మ్యాప్ తప్పుగా చూపడంతో బురదలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పళని ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ నాలుగురోడ్ల కూడలిలో కారు ఎటువైపు నడపాలో తెలియక గూగుల్ మ్యాప్ ఆన్ చేశారు అది చెప్పినట్టు కారును కుడి వైపు తిప్పడంతో బురదగా ఉన్న మట్టిరోడ్డులో చిక్కుకుంది. ముందుకు, వెనుకకు కదలలేక బురదలో కూరుకుపోయింది.