ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సినీనటుడు సోనూసూద్ సోమవారం కలిశారు. అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన సోనూసూద్.. ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ ఫౌండేషన్ తరుపున నాలుగు అంబులెన్స్లను అందించారు. అంబులెన్స్లకు సంబంధించిన తాళాలను సీఎం చేతికి అందజేశారు. అనంతరం ఈ అంబులెన్సులను చంద్రబాబు ప్రారంభించారు. తనను కలిసేందుకు వచ్చిన సోనూసూద్ను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. అనంతరం ఏపీ ప్రభుత్వానికి నాలుగు అంబులెన్సులు అందించినందుకు అభినందించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్న చంద్రబాబు నాయుడు.. ఇందులో భాగస్వామి అయినందుకు సోనూసూద్ను అభినందించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన సోనూసూద్.. ఏపీలో వైద్య సౌకర్యాలను అభివృద్ధి చేయటంలో తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయని అంబులెన్సులు అందించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉంటారన్న సోనూసూద్.. ఏపీ తనకు రెండో ఇళ్లు లాంటిదన్నారు. తన భార్య కూడా ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళేనని గుర్తు చేశారు. ఏపీ ప్రజలు తనను ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉంచుతారన్న సోనూసూద్.. ఏ అవసరం వచ్చినా ఫోన్ కాల్ దూరంలో ఉంటానన్నారు.
మరోవైపు కొవిడ్ సమయం నుంచి చంద్రబాబుతో టచ్లో ఉన్నట్లు సోనూసూద్ తెలిపారు. ఆయన నేతృత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అంబులెన్సులకు ఇప్పటి వరకూ ఎవరికీ ఇవ్వలేదన్న సోనూసూద్.. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్కు అందించినట్లు వివరించారు. తన ఫౌండేషన్ తరుఫున అందించిన అంబులెన్సులలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని.. ఆపద వేళల్లో ఎవరైనా వారు వినియోగించుకోవచ్చునని తెలిపారు. అంబులెన్స్ డ్రైవర్లు, నిర్వహణ ప్రభుత్వం చూసుకుంటుందని వివరించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండమని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగితే.. అందుకు తాను సిద్ధమేనని సోనూసూద్ తెలిపారు. మరోవైపు కొవిడ్ సమయంలో సహాయం అవసరమైన వారికి అండగా నిలిచిన సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నారు. విజయవాడ వరదల సమయంలోనూ తన ఛారిటి ఫౌండేషన్ తరుఫున ఎంతో మందికి సాయం అందించారు.