దుబాయ్ వెళ్లాలంటే హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా.. విజయవాడ నుంచి దుబాయ్ విమాన సర్వీసు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి. విజయవాడ - దుబాయ్ విమాన సర్వీసు విషయంపై అరబ్ ఎమిరేట్స్ సంస్థ పరిశీలన జరుపుతోంది. తాజాగా అరబ్ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అధికారులు కూడా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. విజయవాడ విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డితో సంప్రదింపులు జరిపారు. దీనికి తోడు విజయవాడ నుంచి దుబాయ్కు ఎంత మంది ప్రయాణికులు వెళ్తుంటారు.. ట్రాఫిక్ ఎలా ఉంటుందనే దానిపైనా అరబ్ ఎమిరేట్స్ అధికారుల బృందం సర్వే జరుపుతున్నట్లు సమాచారం.
మరోవైపు విజయవాడ ఎయిర్పోర్టులో ఉన్న ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్ను ఎమిరేట్స్ అధికారులు పరిశీలించారు. అలాగే పాత టెర్మినల్ను కూడా సందర్శించారు. నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణ పనులను కూడా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. విజయవాడ ఎయిర్పోర్టులో కొత్తగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మరో ఆరు నెలల్లో పూర్తికానుంది. దీని గురించి కూడా ఎమిరేట్స్ ప్రతినిధులు వివరాలు తెలుసుకున్నట్లు తెలిసింది. అయితే విజయవాడ - దుబాయ్ విమాన సర్వీసుల ప్రారంభంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎమిరేట్స్ సంస్థ సొంతంగా జరుపుతున్న సర్వే పూర్తయిన తర్వాత ఈ విషయంలో క్లారిటీ రానుంది.
మరోవైపు విజయవాడ నుంచి దుబాయ్ విమాన సర్వీసు నడపాలని గత టీడీపీ హయాంలోనే నిర్ణయించారు. ఈ విషయమై ప్రభాభిప్రాయ సేకరణ కూడా జరిపారు. ఇందులో ఎక్కువ మంది ప్రజలు విజయవాడ దుబాయ్ విమాన సర్వీసు ప్రారంభించాలని కోరారు. దీంతో వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా విజయవాడ దుబాయ్ విమాన సర్వీసు నడపాలని నిర్ణయించారు. అయితే ఆ తర్వాతి కాలంలో ఈ దిశగా అడుగులు పడలేదు. తాజాగా అరబ్ ఎమిరేట్స్ బృందం విజయవాడ ఎయిర్పోర్టును పరిశీలించి వెళ్లటంతో.. ఈ ప్రాంత వాసుల్లో మళ్లీ దీనిపై ఆశలు చిగురిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయి సర్వే తర్వాతే అరబ్ ఎమిరేట్స్ ఈ సర్వీసుపై నిర్ణయం తీసుకోనుంది.