అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి.. ఆ దేశంలో వీసా గడువు ముగిసినా నివసించేవారు, అక్రమ మార్గాల్లో అమెరికాకు వచ్చిన వారిని.. స్వదేశాలకు పంపించే చర్యలు వేగవంతం చేశారు. అందులో భారతీయులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా సైనిక, వాణిజ్య విమానాల్లో అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 205 మంది భారతీయులతో కూడిన అమెరికా సైనిక విమానం సీ17.. పంజాబ్లో దిగింది. అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్.. కొంతమంది భారతీయులను కూడా వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. చట్టవ్యతిరేకంగా అమెరికాలో ఉంటున్న వారిని బయటికి పంపేస్తోంది.
ఈ క్రమంలోనే మంగళవారం 205 మందితో టెక్సాస్ ఎయిర్పోర్టు నుంచి బయల్దేరిన అమెరికా మిలిటరీ విమానం సీ-17.. బుధవారం మధ్యాహ్నం పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. అయితే అందులో ఉన్న వారంతా పంజాబ్, దాని పరిసర రాష్ట్రాలకు చెందిన వారు అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక స్వదేశానికి చేరిన ఈ అక్రమ వలసదారులను ఏం చేస్తారు అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే వారిని అదుపులోకి తీసుకునేందుకు మన దేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని తెలుస్తోంది. దీంతో అవసరమైన తనిఖీలు నిర్వహించిన తర్వాత.. వారందర్నీ ఎయిర్పోర్టు నుంచి బయటికి పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
అయితే వారిని అమెరికా నుంచి స్వదేశానికి పంపించే ముందు ప్రతీ ఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు తెలిపారు. మరికొన్ని రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు.. అక్రమ వలసదారులను తీసుకు రానున్నాయని స్పష్టం చేశారు. అమెరికా హోంలాండ్ అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం.. అమెరికాలో ఉంటున్న 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేవని తెలుస్తోంది. వారిలో 17,940 మందిని వెనక్కి పంపేందుకు అమెరికా ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసింది. 2,467 మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్బంధంలో ఉంచగా.. తొలివిడతలో భాగంగా 205 మందిని పంపించేశారు.
మరోవైపు.. అమెరికా నుంచి అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించాలని అమెరికా తీసుకున్న నిర్ణంపై ఇప్పటికే భారత్ స్పందించింది. ఏ దేశంలోనైనా అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని.. ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. వీసా గడువు ముగిసిన తర్వాత లేదా సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని స్పష్టం చేసింది.
![]() |
![]() |