ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వీడన్‌లో స్కూల్‌లో కాల్పులు, 11 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Wed, Feb 05, 2025, 11:02 PM

స్వీడన్ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా స్కూల్‌లో కాల్పులు జరగడంతో.. ఆ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కాల్పుల్లో నిందితుడు సహా మొత్తం 11 మంది చనిపోయినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించింది. తుపాకీతో స్కూల్ క్యాంపస్‌లోకి చొరబడిన నిందితుడు.. విచక్షణారహితంగా కాల్పులకు దిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో మొత్తం 10 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన తర్వాత నిందితుడు కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ కాల్పులు జరిపింది ఒక్కడేనని.. అతడు గతంలో నేరస్థుడు కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.


స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరెబ్రో నగరంలోని ఒక అడల్ట్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పారు. 10 మంది విద్యార్థులు, ఒక నిందితుడు చనిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే భారీ ఎత్తున భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని చర్యలు ప్రారంభించాయి. అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ వాహనాల్లో బాధితులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న స్వీడన్ అధికారులు.. దీనిపై విచారణ జరుపుతున్నారు. అయితే ఉగ్రదాడి కాదని మాత్రం తేల్చేశారు.


రిస్‌బెర్గ్‌స్కా స్కూల్‌ క్యాంపస్‌లో 20 ఏళ్లకు పైబడిన విద్యార్థులకు పాఠాలు చెబుతారు. ప్రైమరీ, అప్పర్‌ ప్రైమరీ, వలసదారులకు, మానసిక దివ్యాంగులకు ఇక్కడ చదువు చెబుతారని స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే ఇది ఉగ్రదాడి కాకపోవచ్చని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. నిందితుడు ఈ కాల్పులు జరిపిన సమయంలో ఆ స్కూల్ క్యాంపస్‌లో చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉండటంతో ప్రాణ నష్టం తగ్గిందని స్కూల్ యాజమాన్యం తెలిపింది. కాల్పుల శబ్ధం విన్న విద్యార్థులు, టీచర్లు.. క్లాస్ రూంల నుంచి పరుగులు తీసినట్లు చెప్పారు.


ఈ కాల్పుల ఘటనపై స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్‌ క్రిస్టర్సన్‌ స్పందించారు. ప్రశాంతంగా ఉండే స్వీడన్‌లో ఇలాంటి కాల్పుల ఘటన జరగడం చాలా అరుదని పేర్కొన్నారు. స్వీడన్‌కు ఇది ఎంతో బాధాకరమైన రోజు అని పేర్కొన్నారు. స్వీడన్‌ చరిత్రలోనే అతిపెద్ద కాల్పుల ఘటనల్లో ఇది ఒకటని ఆయన అభివర్ణించారు. ఇది అత్యంత భయంకరమైన ఘటన అని పేర్కొన్నారు. కొన్నేళ్ల నుంచి స్వీడన్‌లో గ్యాంగ్‌ వార్‌లు పెరుగుతుండగా.. దానికి తోడు అక్రమ వలసలు ఎక్కువ అవుతుండటం ఆ దేశానికి తీవ్ర తలనొప్పిగా మారాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com