తిరుమలలో ఫిబ్రవరి 12వ తేదీ (బుధవారం) శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 'పురాణాలపరంగా తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి. అయితే ఈ పుణ్యతీర్థాలలో, సప్తగిరులలో వెలసి ఉన్న సప్త తీర్థములు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థము, కూమారధార తీర్థము, తుంబురు తీర్థము, శ్రీరామకృష్ణ తీర్థము, ఆకాశగంగ తీర్థము, పాపవినాశన తీర్థము, పాండవ తీర్థము అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరించిన యెడల భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందగలరని ఆర్యోక్తి' ఉందని టీటీడీ చెబుతోంది.
'శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ప్రతి ఏటా మకరమాసం నందు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుణ్యతీర్థము స్వామివారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలసివున్నది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ రామకృష్ణ తీర్థ పర్వదినమును ఆలయ ఆర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్కంద పురాణానుసారం పూర్వకాలమున శ్రీరామకృష్ణుడను మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నాడు. ఈ తీర్థ తీరమున నివసించుచూ, స్నానపానాదులు చేయుచూ, శ్రీమహావిష్ణువును గూర్చి కఠోర తపస్సు ఆచరించి విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందారు' అని చెబుతారు.
'ఎవరైనా మానవులు అజ్ఞానంతో తల్లిదండ్రులను, గురువులను దూషించినందు వల్ల కలిగినటువంటి దోషమును, ఈ పుణ్యతీర్థమునందు స్నానమాచరించుట వలన ఆ దోషము నుండి విముక్తి పొంది సుఖముగా జీవించగలరని ప్రాశస్త్యం. ఈ పర్వదినంనాడు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు మొదలగు పూజా సామగ్రిని తీసుకు వెళ్ళి శ్రీరామకృష్ణ తీర్థంలో వెలసివున్న శ్రీరామచంద్ర మూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించడంతో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ముగియనుంది' అని టీటీడీ ప్రకటనలో తెలిపింది. ప్రతి ఏటా తిరుమలలో నిర్వహించే శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటికి భక్తులు భారీగా హాజరవుతుంటారు.
'ఈ పర్వదినంనాడు ఉదయం 7.30 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళతారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు పాల్గొంటారు' అని టీటీడీ తెలిపింది. రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తుల కోసం టీటీడీ అన్నప్రసాదాలను, భద్రతా ఏర్పాట్లను పోలీసు, అటవీశాఖ చేపడుతుంది. అంతేకాదు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడుపుతారు. టీటీడీ వైద్యవిభాగం ఆధ్వర్యంలో మెడికాల్ టీమ్లు కూడా అందుబాటులో ఉంటారు. టీటీడీ మార్గమధ్యంలో పలుచోట్ల భక్తులకు సౌకర్యంగా ఉండేలా నడకమార్గాలు ఏర్పాటు చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa