తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. టీటీడీ బోర్డును రద్దు చేయాలంటూ రామచంద్ర యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. టీటీడీ బోర్డు, తిరుపతి తొక్కిసలాట ఘటనపై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని, బాధితులకు పరిహారం పెంచాలంటూ రామచంద్రయాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే టీటీడీ బోర్డును రద్దుచేయాలన్న ఆయన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రామచంద్ర యాదవ్ పిటిషన్ మీద విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. పిటిషన్లోని అంశాలపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయడం లేదన్న సుప్రీంకోర్టు.. పిటిషన్ విచారించడానికి నిరాకరించింది.
మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, టీటీడీ నిర్వహణ లోపం కారణంగానే తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగిందని భారతీయ చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధినేత రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు. అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయలు చొప్పున పరిహారం కూడా ఇటీవల పంపిణీ చేశారు. గాయపడిన వారికి ఐదువేల రూపాయల చొప్పున అందించారు. ఘటనకు టీటీడీ బాధ్యత తీసుకోవాలని.. వెంటనే తన పదవులకు రాజీనామా చేయాలని రామచంద్రయాదవ్ అప్పట్లో డిమాండ్ చేశారు. ప్రస్తుత టీటీడీ బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని అప్పట్లో సీఎం నారా చంద్రబాబు నాయుడును రామచంద్రయాదవ్ కోరారు.
మరోవైపు జనవరి 8వ తేదీ జరిగిన తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు చనిపోయారు. 40 మంది వరకూ గాయపడ్డారు. ఈ ఘటనలో బాధితులకు ప్రభుత్వం, టీటీడీ పరిహారం అందించాయి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పరిహారం అందించింది. టీటీడీ సభ్యులు వారి ఇళ్ల వద్దకు వెళ్లి పరిహారం డబ్బులు అందజేశారు. అలాగే వారి కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చేందుకు టీటీడీ అంగీకరించింది. అలాగే తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ జరుపుతోంది. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో తిరుపతి తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.