ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీ ఫిక్స్.. ఆ రూల్ బయటకు తీసిన రఘురామ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 07:09 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 24వ తేదీ ఉదయం ఏపీ శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఫిబ్రవరి 28వ తేదీ లేదా మార్చి 3వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జె్ట్‌ను ఆ రెండు రోజుల్లో, ఏదో ఒక రోజు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. మొత్తం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలిసింది.


అయితే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై మొదటి రోజున నిర్వహించే బీఏసీ సమావేశం తర్వాత ఓ క్లారిటీ రానుంది. అయితే సమావేశాలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమై రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి మంత్రులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తి స్తాయి బడ్జె్ట్ ప్రవేశపెట్టనుంది.


 మరోవైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ.. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రాధానం సంతరించుకున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా.. ఏ ఎమ్మెల్యే అయినా సరే.. సెలవు కోసం అనుమతి తీసుకోకుండా 60 రోజులు సభకు రాకపోతే అనర్హత వేటు వేయవచ్చంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎమ్మెల్యే ఎవరైనా సరే సరైన కారణంతో సెలవు కోసం దరఖాస్తు చేసుకోవాలని.. అలా దరఖాస్తు చేయకుండా 60 రోజులు శాసనసభకు రాకుంటే చట్టప్రకారం ఆ ఎమ్మెల్యేపై వేటు వేయవచ్చని రఘురామ అన్నారు. ఒకవేళ వైఎస్ జగన్ అలా రాకుంటే.. పులివెందులకు ఉపఎన్నిక వస్తుందంటూ అభిప్రాయపడ్డారు.


ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా, రారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన రాకండా మిగతా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా అనే దానిపైనా క్లారిటీ లేదు. ఒకవేళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కాకపోయినా.. అసెంబ్లీ రిజిస్టర్‌లో సంతకం పెట్టి వెళ్లొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా చేసినా అసెంబ్లీకి హాజరు అయినట్టేనని చెప్తున్నారు. మరి ఏపీ అసెంబ్లీ సమావేశాలపై వైసీపీ స్టాండ్ ఏంటీ.. వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదీ చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com