ఏపీ ప్రజలకు పౌర సేవలు మరింత సులభంగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మన మిత్ర తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మన మిత్ర పేరుతో వాట్సాప్లోనే 161 పౌర సేవలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. దేవస్థానాల్లో దర్శనాల బుకింగ్ దగ్గర నుంచి, సర్టిఫికేట్ల వరకూ 161 సేవలు మొబైల్ ద్వారా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే వాట్సాప్ గవర్నెన్స్కు సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. ఇకపై అన్ని ధ్రువపత్రాలు మొబైల్ ఫోన్లోనే జారీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ మీద ఐటీ శాఖ కార్యదర్శి శుక్రవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఇకపై అన్ని సర్టిఫికేట్లు సెల్ ఫోన్లోనే జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఏపీలోని ప్రతి పౌరుడికి డిజిలాకర్ సదుపాయం కల్పిస్తామని వివరించారు. అన్ని సర్టిఫికేట్లను వాట్సప్లోనే డౌన్లోడ్ చేసుకొనేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మరోవైపు డేటా అనుసంధానంతో ఏపీ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఐటీ సెక్రటరీ వెల్లడించారు. ఇందుకోసం డేటా అనుసంధానం చేపడుతున్నామని.. ఇది పూర్తి అయితే.. ప్రజలకు ప్రభుత్వానికి అర్జీలు, ఫిర్యాదులను వాట్సాప్ ద్వారా చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇక నిరక్షరాస్యుల నుంచి వాయిస్ మెసేజ్ ద్వారా అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇంటర్ హాల్టికెట్లు వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. ఫీజుల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
మన మిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఏపీలో మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకూ ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. రోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్లు వాట్సాప్లోనే డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించింది ఏపీ సర్కారు. పదో తరగతి హాల్ టికెట్లను కూడా వాట్సప్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునే వెసలుబాటు ఇవ్వాలని ఆలోచనలు చేస్తున్నారు. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |