భారత దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలని చూసిన పలువురు పాకిస్థానీలపై ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపి వారి కుట్రను భగ్నం చేసింది. అయితే ఈ కాల్పుల్లో మొత్తం ఏడుగురు చనిపోగా.. వారిలో ముగ్గురు పాకిస్థానీ ఆర్మీ సిబ్బందిగా అధికారులు భావిస్తున్నారు. అలాగే మిగతా వారంతా ఉగ్రవాదులు అని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఘటన, ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జమ్ము కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో గల కృష్ణ ఘాటి సెక్టార్లో ఫిబ్రవరి 4వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్లు భారత ఆర్మీ సిబ్బంది వెల్లడించింది. నియంత్రణ రేఖను దాటి భారత దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నిస్తున్న పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్పై సైన్యం మెరుపు దాడికి పాల్పడింది. ఈక్రమంలోనే ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరగ్గా.. ఏడుగురు చొరబాటు దారులు హతమైనట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి.
అయితే మృతుల్లో ఇద్దరు నుంచి ముగ్గురు పాకిస్థాన్ ఆర్మీ సిబ్బంది ఉండగా.. మిగతా వారంతా ఉగ్రవాదులు అని చెప్పింది. అయితే వారు అల్ బదర్ గ్రూపునకు చెందిన సభ్యులు అని కూడా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శాంతి మార్గంలో వెళ్తామని చెప్పిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. కశ్మీర్ సహా భారత్తో ఉన్న అన్ని సమస్యలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నట్లు ఇటీవలే ఈ కార్యక్రమంలో చెప్పారు.
జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలు తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో "కశ్మీర్ సంఘీభావ దినం" పేరుతో సంయుక్త సదస్సు నిర్వహించినట్లు సమాచారం. దీనికి హమాస్ కూడా హాజరు అయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈక్రమంలోనే భారత నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. తమపై దాడి జరిపేందుకు ప్రయత్నించిన పాకిస్థానీల చర్యను అడ్డుకుని ఏడుగురిని మట్టుబెట్టాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa