ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూరీ జగన్నాథుడి సన్నిధిలో టీమిండియా క్రికెటర్లు

sports |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2025, 10:07 PM

ఇంగ్లాండ్‌తో రెండో వన్డేకు ముందు పలువురు భారత క్రికెటర్లు ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్ సుందర్‌లో ఆలయంలోకి వెళ్లి.. స్వామి వారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెటర్ల దర్శన కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అర్చకులు, అధికారులు క్రికెటర్లకు స్వాగతం పలికారు. దగ్గరుండి దర్శనం కల్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.


కాగా, ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఆదివారం ఒడిశాలోని కటక్‌లో జరగనుంది. ఇందు కోసం ఇప్పటికే రెండు జట్లు కూడా కటక్‌కు చేరుకుని.. ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. ప్రాక్టీస్ సెషన్‌ అయిన తర్వాత ఈ క్రికెటర్లు.. ఆలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ పూర్తయ్యాక.. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు దుబాయ్‌కు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు పూరీ జగన్నాథుడిని దర్శించుకోవడం గమనార్హం.


ఇక ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది భారత్. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో వన్డేలోనూ గెలిచి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అటు టీ20 సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లాండ్.. వన్డే సిరీస్‌లో ఎట్టపరిస్థితుల్లో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.


ఇక చాలా రోజుల తర్వాత కటక్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతోంది. అంతేకాకుండా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు.. ఈ మ్యాచ్ ఆడే జట్టులో ఉన్నారు. దీంతో తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అక్కడి కటక్‌లోని ఫ్యాన్స్.. ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడటంతో ఓ దశలో స్టేడియం సమీపంలో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కోసం పటిష్ట భద్రతను కల్పించింది ఒడిశా ప్రభుత్వం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com