అనంతపురంలో సంచలనం రేపిన రాజహంస స్వీట్ హోమ్స్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అనంతపురంలో బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలోని రాజహంస స్వీట్ హోమ్స్లో జనవరి నెలలో భారీ చోరీ జరిగింది. జనవరి 22వ తేదీ వెనుక వైపు నుంచి గోడ దూకి లోపలికి వచ్చిన దొంగలముఠా.. మూడు ఇళ్లలో నగదు, బంగారం దోచుకెళ్లింది. మాస్కులు ధరించిన నలుగురు దుండగులు తెల్లవారుజామున రాజహంస స్వీట్ హోమ్స్లోకి గోడ దూకి ప్రవేశించారు. అనంతరం 8, 15, 34 విల్లాల్లో చోరీలకు పాల్పడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండ్రెడ్డి వెంకటశివారెడ్డికి చెందిన 34వ విల్లాలోకి ప్రవేశించిన దొంగలు.. భారీగా బంగారం, నగదు దోచుకెళ్లారు. కుమార్తె పెళ్లి కోసం కొనుగోలు చేసిన నగలు, నగదు చోరీ చేశారు.
అలాగే కదిరి డీఈ శివశంకర్ నాయుడుకు చెందిన 15వ విల్లాలోకి ప్రవేశించిన దొంగలు.. 3 తులాల బంగారం, కిలో వెండి రూ.62 వేల నగదు చోరీ చేశారు. ఎనిమిదో విల్లాలో ఉంటే రంజిత్ అనే వ్యక్తి ఇంట్లోనూ చోరీ చేశారు. మొత్తం కలిసి మూడున్నర కోట్లు విలువైన బంగారం, రూ.20 లక్షల వరకూ నగదు చోరీ జరిగినట్లు తెలిసింది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ఛాలెంజింగ్గా తీసుకుని దర్యాప్తు జరిపారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అలాగే దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఈ దొంగలముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేసింది దేశంలోనే మోస్ట్ వాంటెడ్ ముఠాగా ఉన్న ధార్ గ్యాంగ్గా పోలీసులు గుర్తించారు.
మధ్యప్రదేశ్కు చెందిన ఈ ముఠాను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు టెక్నాలజీ సాయం తీసుకున్నారు. ధార్ గ్యాంగ్ మీద రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, గుజరాత్లోనూ కేసులు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే ధార్ గ్యాంగ్ మీద 32 కేసులు ఉన్నాయని.. నాలుగు రాష్ట్రాల పోలీసులు వీరి కోసం వెతుకుతున్నారని అనంతపురం ఎస్పీ జగదీష్ వెల్లడించారు. గ్యాంగ్ లీడర్ నారూ పచావర్ సహా ఈ గ్యాంగ్లోని ముగ్గురు మాత్రమే పోలీసులకు చిక్కినట్లు ఆయన వివరించారు. వీరి వద్ద నుంచి రూ.90 లక్షలు విలువ చేసే బంగారం, వజ్రాలు, రూ.19.35లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa