దేశంలోని వివిధ ఎన్నికల్లో ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్-ఏఐఎంఐఎం పోటీ చేసిన ప్రాంతాల్లో బీజేపీ గెలుస్తుంది అనే వాదన ఉంది. ఇప్పుడు ఇదే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి రుజువు అయింది. ఢిల్లీ ఎన్నికల్లో ముస్తాఫాబాద్, ఓక్లా నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీ తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది. అయితే ఈ రెండు చోట్లా ఆ పార్టీ ఓటమి పాలైంది. అయితే కీలకంగా ఉన్న ముస్తాఫాబాద్ స్థానంలో ఆ పార్టీ ఆప్కు పడే ఓట్లను చీల్చిందని.. ఫలితంగా ఆ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారనే వాదన బలంగా తెరపైకి వచ్చింది.
అయితే ముస్తాఫాబాద్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ తరఫున తాహిర్ హుస్సేన్ పోటీ చేశారు. అయితే 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా తాహిర్ హుస్సేన్ ఉన్నారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన ఆయన.. ఎన్నికల వేళ.. బెయిల్పై బయటికి వచ్చి ప్రచారం చేశారు. ఈ నియోజకవర్గంలో ముస్తఫాబాద్ బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిస్త్ ఘన విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఆదిల్ అహ్మద్ ఖాన్పై 17,578 ఓట్ల తేడాతో మోహన్ సింగ్ బిస్త్ గెలిచారు. ఇక మూడో స్థానంలో నిలిచిన తాహిర్ హుస్సేన్కు 33,474 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలీ మెహందీకి కేవలం 11,763 ఓట్లు మాత్రమే పడ్డాయి.
ఓట్ల శాతం పరంగా చూస్తే బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిస్త్కు 42.36 శాతం.. ఆప్ అభ్యర్థి ఆదిల్ అహ్మద్ ఖాన్కు 33.62 శాతం.. ఎంఐఎం అభ్యర్థి తాహిర్ హుస్సేన్కు 16.64 శాతం వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో తాహిర్ హుస్సేనే గెలవకపోయినప్పటికీ ఆయనకు మంచి ఓట్లే పడ్డాయి. ఈ నియోజకవర్గంలో ఆప్కు పడే ముస్లిం ఓట్లు కాస్తా.. ఎంఐఎం అభ్యర్థికి పడటంతో ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిస్త్ గెలిచారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న తాహిర్ హుస్సేన్ బెయిల్పై బయటికి వచ్చి ముస్తాఫాబాద్ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ ఎన్నికల్లో తాహిర్ హుస్సేన్ కోసం ప్రచారం చేశారు. ఇక ముస్తాఫాబాద్లో 2.6 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో 40 శాతం ముస్లింలు, 60 శాతం హిందువులు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎంఐఎం తరఫున తాహిర్ హుస్సేన్ బరిలోకి దిగడంతో ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీకి లబ్ధి చేకూర్చారని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఎన్నికల ప్రచారంలోనే ఆరోపించాయి.
2020 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో మొత్తం 53 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 40 మంది ముస్లింలు ఉండగా.. మరో 13 మంది హిందువులు ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కౌన్సిలర్గా ఉన్న తాహిర్ హుస్సేన్పై.. అల్లర్లలో అతని పేరు తెరపైకి రావడంతో ఆప్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ హత్యతో పాటు పలు కేసులు కూడా తాహిర్ హుస్సేన్పై నమోదయ్యాయి. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం తాహిర్ హుస్సేన్పై 10 ఎఫ్ఐఆర్లు, ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు ఉన్నాయి. అతడికి సుమారు రూ.42 లక్షల చరాస్తులు. ఆయన భార్య పేరుతో రూ.43 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి. స్థిరాస్తుల విషయానికొస్తే ఆయనకు రూ.8.85 కోట్లు.. ఆయన భార్యకు రూ.9 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa