ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. మంటలు చెలరేగి 41 మంది సజీవ దహనం

international |  Suryaa Desk  | Published : Sun, Feb 09, 2025, 07:55 PM

దక్షిణ మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును.. ట్రక్కు ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు ఢీకొట్టడంతో బస్సులో మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే క్షణాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు బయటకు రావడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే వారికి మంటలు అంటుకోవడంతో ఏకంగా 41 మంది ప్రయాణికులు ఆ బస్సులోనే మంటలు అంటుకుని.. సజీవ దహనం అయ్యారు. మరికొందరు గాయాలతో బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.


దక్షిణ మెక్సికోలోని కాన్కున్ నుంచి టబాస్కోకు బస్సు వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం బస్సులో 48 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా.. అందులో 38 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ప్రమాదానికి కారణం అయిన ట్రక్కు డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. ట్రక్కు ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.


 ఇప్పటివరకు దాదాపు అన్ని మృతదేహాలను వెలికితీశామని చెప్పిన అధికారులు.. మరికొన్ని అందులోనే ఉండిపోయినట్లు వెల్లడించారు. ప్రమాదం ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి వివరాలను సేకరించి.. వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే మృతదేహాలు మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో.. వారిని గుర్తించడం కష్టంగా మారిందని చెబుతున్నారు.


ఈ ఘోర ప్రమాదంపై టబాస్కో రాష్ట్రంలోని కోమల్‌కాల్కో నగర మేయర్ ఓవిడియో పెరాల్టా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాన్కున్ నుంచి టబాస్కోకు వెళ్లే బస్సు ప్రమాదానికి గురి కావడం పట్ల తీవ్రంగా చింతిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ బస్సు ప్రమాద ఘటనపై సదరు బస్సు ఏజెన్సీ స్పందించింది. ప్రమాద సమయంలో బస్సు పరిమిత వేగంలోనే ప్రయాణిస్తోందని.. ప్రమాదానికి గల కారణం ఏంటి అనే దానిపై ఆరా తీస్తున్నామని వివరించింది. ఈ కేసు దర్యాప్తులో అధికారులకు పూర్తిగా సహకరిస్తామని బస్సు కంపెనీ స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com