ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. సిద్ధంగా ఉండాలంటూ మంత్రి సూచన

international |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 08:37 PM

సింగపూర్ దేశానికి ఉగ్రదాడుల ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ దేశానికి చెందిన హోమంత్రి కె.షణ్ముగమే దీనిపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు. దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని.. ప్రజలంతా ఇందుకోసం మానసికంగా సిద్ధంగా ఉండాలంటూ ప్రకటించారు. దీంతో ఆ దేశ పౌరులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిజంగానే దాడులు జరిగే అవకాశం ఉందా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


సింగపూర్‌లో తీవ్రవాద భావజాలం కల్గిన వ్యక్తుల సంఖ్య పెరుగుతున్నట్లు అక్కడి ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశానికి ఉగ్రదాడుల ముప్పు ఉందని.. ఇందుకు సింగపూర్ పౌరులు మానసికంగా సిద్ధంగా ఉండాలని హోమంత్రి కె. షణ్ముగం హెచ్చరించారు. తీవ్రవాద ప్రణాళికలకు సంబంధించిన ఓ ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ కావడంతో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.


  ఫోర్ట్ కేనింగ్ పక్కన ఉన్న సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ పరిధిలోని తెండాయుతపాణి ఆలయంలో హిందూ భక్తులు మురుగన్ దేవుడి గౌరవార్థం తైపూసం 2025 పండుగను జరుపుకుంటున్నారు. ఈక్రమంలోనే అక్కడకు వచ్చిన హోంమంత్రి ఈ కామెంట్లు చేశారు. తైపూసం అనేది సింగపూర్, మలేషియా, భారత దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో తమిళ మూలాలు కల్గిన ప్రజలు జరుపుకునే పండుగ.


సింగపూర్‌కు చెందిన ఓ 18 ఏళ్ల విద్యార్థి ఆన్‌లైన్ గేమ్‌లో ఉగ్రవాది పాత్ర పోషించాడని.. చైనీయులు మలేయుల మధ్య జాతి యుద్ధాన్ని ప్రారంభించాలనుకున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. 2019 మార్చి నెలలో న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చిలోని రెండు మసీదుల్లో 51 మందిని చంపిన ఆస్ట్రేలియన్ తెల్లజాతి ఆధిపత్యవాది బ్రెంటన్ టారెంట్‌ను అతడు ఆరాధించినట్లు తెలుసుకున్నారు.


ఈక్రమంలోనే సింగపూర్‌లోని ఒక మసీదులో ముస్లింలపై దాడి చేయాలనుకున్న ఆ యువకుడు, నవ-నాజీ, తెల్ల ఆధిపత్యవాద, తీవ్రవాద సమూహాలకు సంబంధించిన లోగోల కస్టమ్ ప్రింట్లతో టాటూలు వేయించుకున్నాడు. అలాగే టీషర్టులపై ప్రింటులు కూడా వేయించాడు. వీటని గుర్తంచి స్వాధీనం చేసుకున్న అధికారులు యువకుడితో పాటు ఉగ్ర సంస్థలకు సాయం చేస్తున్న ఓ మహిళ సహా మరో డ్రైవర్‌ను నిర్బంధించేందుకు ఆదేశాలు జారీ చేశారు.


ఈ విషయాన్ని వివరిస్తూనే మంత్రి షణ్ముగం.. దేశానికి ఉగ్రదాడులు ముప్పు ఉందన్నారు. అయితే అంతర్గత భద్రతా శాఖ క్రియాశీలకంగా వారిని గుర్తిస్తోందని చెప్పారు. అంతేకాకుండా దేశంలో తీవ్రవాద భావజాలం పెరుగుతున్న విషయాన్ని ప్రజలంతా గుర్తించాలని చెప్పుకొచ్చారు. అలాగే ఉగ్రదాడులకు మానసికంగా సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com