టిడి స్థానికాలయాలు, వసతిగృహాల్లో మెరుగైన నాణ్యత ప్రమాణాలు పాటించడం ద్వారా ఐఎస్వో (ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్) గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి జరుగుతోందని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం వెల్లడించారు. తిరుపతిలోని బంగళాలో మంగళవారం జెఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ మొదటిగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయంలో నాణ్యత ప్రమాణాలు పెంచి ఐఎస్వో గుర్తింపు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం కల్పిస్తామని, నాణ్యమైన ప్రసాదాలు అందిస్తామని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని, భక్తులతో గౌరవప్రదంగా నడుచుకునేలా ఉద్యోగులకు సూచనలిస్తామని చెప్పారు. వసతిగృహాల్లో అన్నప్రసాదాలను గదుల్లోకి తీసుకెళ్లకుండా భక్తులకు అవగాహన కల్పిస్తామని, అక్కడక్కడా టివిలు ఏర్పాటుచేసి ఎస్వీబీసీ ద్వారా ఆధ్యాత్మికత పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చేస్తామని తెలిపారు. భక్తులకు అర్థమయ్యేలా సూచికబోర్డులు ఏర్పాటుచేస్తామని, గదులు సులభంగా పొందేలా చర్యలు చేపడతామని, యాత్రికుల సమాచార కేంద్రాల ద్వారా కచ్చితమైన సమాచారం అందిస్తామని వివరించారు.
యాత్రికులకు వైద్య సౌకర్యం కల్పించి మందులు పంపిణీ చేస్తామని, విష్ణునివాసం, శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం వద్ద అంబులెన్స్ను అందుబాటులో ఉంచి హృదయ సంబంధ సమస్యలు ఎదురైతే వెంటనే చికిత్స పొందేలా పరికరాలు ఏర్పాటు చేస్తామని జెఈవో తెలియజేశారు. దివ్యాంగుల కోసం మూడు చక్రాల సైకిళ్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. భద్రతాపరంగా సమస్యలు ఎదురైనపుడు వెంటనే స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుగా, ఈ వారంలో మాక్డ్రిల్ నిర్వహిస్తామని వెల్లడించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రాబోయే రోజుల్లో ఆర్.ఎఫ్.ఐ.డి (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటి డివైస్) పరికరం ద్వారా ఆభరణాలకు చిప్ను అమర్చి రక్షణ చర్యలు చేపడతామన్నారు.
ఈ సమావేశంలో డెప్యూటీ ఈవోలు శ్రీమతి ఝాన్సీరాణి, శ్రీమతి లక్ష్మీనరసమ్మ, విజివో శ్రీ అశోక్కుమార్ గౌడ్, సిఎంవో డా.. నాగేశ్వరరావు, ఎవిఎస్వోలు శ్రీ నందీశ్వర్రావు, శ్రీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.