ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2025, 10:59 AM

రాష్ట్రంలో స్టేట్‌ హైవేల అభివృద్ధికి రంగం సిద్ధమైంది. రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగిపోయేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో రహదారుల వ్యవస్థను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేయడం ద్వారా పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని సర్కారు విశ్వసిస్తోంది. రహదారి కారిడార్‌ నెట్‌వర్క్‌ బలపడితే రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుందని, పెట్టుబడులు కూడా వస్తాయని ఆశిస్తోంది. దీనిలో భాగంగా ఎన్‌హెచ్‌ల స్థాయిలో రాష్ట్ర ప్రధాన రోడ్ల (స్టేట్‌ హైవేల)ను పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో విస్తరించాలని నిర్ణయించింది. కేంద్ర సర్కారు కూడా ఇదే విధానంలో జాతీయ రహదారులను నిర్మిస్తోంది. గతంలో రాష్ట్రంలోనూ మూడు ప్రధాన రహదారులను గతంలో పీపీపీ విధానంలో అభివృద్ధి చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో 10,200 కి.మీ. మేర రహదారులను ఈ విధానంలో విస్తరించి, అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కొన్ని రోడ్లను ఎంపిక చేశారు. వాటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కొనసాగుతోంది. ఆ నివేదికలు వచ్చిన తర్వాత ఎంపిక చేసిన తొలిదశ రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలవనుంది. వచ్చే 3నెలల్లో ఈ ప్రక్రియ కొలిక్కివస్తుందని ఆర్‌అండ్‌బీ వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేట్‌ భాగస్వామ్యంలో రహదారుల నిర్మాణం పూర్తయితే వాటి నిర్వహణకు టోల్‌గేట్లు ఏర్పాటుచేసి వాహనరుల నుంచి ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆర్‌అండ్‌బీ నియంత్రణలో 45,378 కి.మీ. రహదారులు ఉన్నాయి. ఇందులో గ్రామీణ, మండల, జిల్లా కేంద్రాలతో అనుసంధానమైన జిల్లా ప్రధాన రహదారులు (ఎండీఆర్‌) 32,725 కిలోమీటర్లు, డివిజనల్‌ కేంద్రాలు, జిల్లాలను అనుసంధానించే స్టేట్‌ హైవేలు 12,653 కి.మీ. మేర ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa