నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్లో 18 రాష్ట్రాలలో ఏపీ 17వ స్థానంలో ఉందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేశ్ తెలిపారు. గుంటూరులో ఆదివారం ‘ఆంధ్రాలో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేదెలా?’ అనే అంశంపై జరిగిన చర్చా గోష్టిలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఆరోగ్య స్థితిపై నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికలోని అంశాలను వివరించారు. అప్పుల సూచీలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, అప్పులు తీర్చే విషయంలో వెనుకబడిందని తెలిపారు. 2014 నుంచి 2023 వరకు ఏటా 20 శాతం అదనంగా అప్పులు చేయాల్సి వచ్చిందని నివేదిక వెల్లడించినట్టు పేర్కొన్నారు. మరోవైపు ఏటా రాబడి 6 శాతం వరకు తగ్గుతూ వచ్చిందన్నారు. గత 10 సంవత్సరాలలో రాష్ట్ర బడ్జెట్లో మూలధన వ్యయం 4 శాతానికే పరిమితమైందన్నారు. సదుద్దేశంతో ఏర్పాటు చేసిన సీఎ్ఫఎంఎస్ విధానం దారి తప్పిందన్నారు. ప్రస్తుతం దిగజారిన వ్యవస్థలో ప్రజలను కుల, మత, ప్రాంతాల వారీగా విభజించే విష సంప్రదాయాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. ప్రధాన పార్టీలు గెలుపు కోసం ఉచితాలను ప్రకటిస్తున్నాయని అన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి వంటి వాటినే ప్రజలు కోరుకుంటున్నారని, ఉచితాలను కాదని వివరించారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 31 జల వనరుల ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని, తద్వారానే సంపద సృష్టి జరుగుతుందన్నారు. చర్చా గోష్టిలో ‘నేస్తం’ సహ వ్యవస్థాపకులు టి. ధనుంజయరెడ్డి, రాజ్యాంగ చర్చా వేదిక కార్యదర్శి అవధానుల హరి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa