దాయాది దేశం పాకిస్తాన్లో నీటి కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. అక్కడి భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. దీంతో ఎన్ని అడుగుల మేర తవ్వినా ఒక్క చుక్క నీరు కూడా కనిపించడం లేదు. 700 అడుగులు తవ్వినా నీళ్లు రాకపోవడంతో.. పాక్వాసుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే తిండి లేక విలవిలలాడుతుండగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు.. ఇప్పుడు నీటి సమస్య కూడా పెరిగిపోవడంతో.. ఏం చేయాలో, ఎలా బతకాలో అర్థం కాక పాకిస్తాన్ ప్రజలు అయోమయంలో మునిగిపోయారు. పాకిస్తాన్లో 1990ల్లో నీటి మట్టం 100 అడుగులు ఉండగా.. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తూ ఇప్పుడు 700 అడుగులకు పడిపోయినట్లు అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇక ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్నది వేసవి కాలం కావడంతో.. పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందోనని పాకిస్తాన్ సతమతంలో పడింది. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చి నెలల్లో తక్కువ వర్షపాతం నమోదు అవుతుందని పాకిస్తాన్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లో కరువు పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అలర్ట్ అయిన రావల్పిండి నగర నీరు, పారిశుద్ధ్య సంస్థ.. నగరంలో ప్రజల నీటి అవసరాలకు సంబంధించి ముందు జాగ్రత్తగా కీలక సూచనలు చేసింది. రావల్పిండి నగరాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటిస్తూ.. ప్రజలకు నీటి కొరత గురించి తీవ్ర హెచ్చరికలు చేసింది.
పాకిస్తాన్ వార్తాపత్రిక అయిన డాన్లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం.. రావల్పిండిలోని గారిసన్ నగరంలో నివసిస్తున్న ప్రజలకు కరువు కారణంగా నీటి కొరత ఎక్కువగా ఏర్పడిందని రావల్పిండి నగర నీరు, పారిశుద్ధ్య సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ముహమ్మద్ సలీం అష్రఫ్ వెల్లడించారు. దీంతో పాటు జనాభా వేగంగా పెరుగుతుండటం, అనేక ఆర్థిక కార్యకలాపాలు, వనరుల కొరత కూడా ఈ నీటి కొరతకు కారణం అమవుతున్నాయని చెప్పారు.
అయితే పాకిస్తాన్లో సీజన్లో వర్షాలు ఎక్కువగా కురవకపోవడం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. చాలా కాలంగా వర్షాలు పడకపోవడంతో రిజర్వాయర్లు, భూగర్భ జల వనరుల్లో నీటిమట్టం వేగంగా తగ్గిపోయిందని ముహమ్మద్ సలీం అష్రఫ్ తెలిపారు. ఈ కారణంగానే పాక్ ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. రావల్పిండి నగరానికి ప్రతిరోజూ 68 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం అవుతాయని పేర్కొన్నారు. అయితే రావల్-ఖాన్పూర్ ఆనకట్టలు, 490కి పైగా బోర్లు సహా ప్రస్తుతం ఉన్న అన్నిరకాల నీటి వనరులను ఉపయోగించినా.. 51 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే అందుంతోందని చెప్పారు. అంటే ఇప్పటికే రావల్పిండి నగరంలో నీటి సమస్య ఉందని.. రానున్న కాలంలో అది మరింత ఎక్కువ అయ్యే పరిణామాలు కనిపిస్తున్నాయని.. స్థానిక అధికారులు పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa