విశాఖ బీచ్రోడ్డులో వాకింగ్ చేయడం, సాయంత్రం వేళ సమయం దొరికితే అక్కడి రక్షణ గోడపై కూర్చుని చల్లని వాతావరణాన్ని ఆస్వాదించడం నగరవాసులకు చాలా ఇష్టం. కానీ నోవాటెల్ హోటల్ డౌన్ ఎదురుగా ఉన్న ప్రాంతం అంటే మాత్రం బీచ్కు వెళ్లేవారికి వణుకు పుడుతోంది. పందిమెట్ట వైపు నుంచి వచ్చే వాహనాలు తరచూ అదుపుతప్పి బీచ్రోడ్డులోని పారాపిట్వాల్ (రక్షణగోడ)ను ఢీకొంటున్నాయి. గత పదేళ్లలో అక్కడ ఏడు ప్రమాదాలు జరిగాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పది మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఇసుక లారీ అదేచోట అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొని, దానిని ఆనుకున్న ఉన్న చిల్డ్రన్ పార్కులోకి దూసుకుపోయింది.శ్రీకాకుళం నుంచి ఇసుకలోడుతో వచ్చిన లారీ పందిమెట్ట జంక్షన్ నుంచి ఫిషింగ్ హార్బర్కు వెళ్లే క్రమంలో నోవాటెల్ డౌన్ దిగుతుండగా అదుపుతప్పడంతో నేరుగా బీచ్రోడ్డు రక్షణగోడను ఢీకొంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే లారీ అమిత వేగంతో గోడను ఢీకొట్టడంతో రాళ్లు గాల్లోకి ఎగిరిపడడంతో సమీపంలో వాకింగ్ చేస్తున్న వన్టౌన్లోని దిగువరెల్లి వీధికి చెందిన తుపాకుల వెంకటరవికుమార్ తలకు గాయమైంది. రవికుమార్ను వెంటనే కేజీహెచ్కు తరలించారు. లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa