విశాఖ పరిధిలోని చింతపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్(ఈఎంఆర్) పాఠశాలలో విద్యార్థులపట్ల ఉపాధ్యాయులు అనుమానుషంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పాడేరు గురుకులం ఓఎస్డీ పీఎస్ఎన్ మూర్తి, ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి మంగళవారం విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థులు, విచారణ అధికారుల కథనం ప్రకారం... ఈఎంఆర్ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న ఎనిమిదో తరగతి చదువుతున్న కొంతమంది బాలురు తమను టీజింగ్ చేస్తున్నారంటూ అదే తరగతికి చెందిన బాలికలు ఇటీవల గణితం ఉపాధ్యాయుడు యోగేశ్ కుమార్కి ఫిర్యాదు చేశారు. ఆయనతోపాటు అకౌంటెంట్ ఎం.సూర్యకాంత్, సోషల్ ఉపాధ్యాయుడు అశుతోశ్కుమార్, మ్యూజిక్ టీచర్ ప్రభాత్లు ఈ నెల 11వ తేదీ రాత్రి పది గంటలకు ఎనిమిదో తరగతి విద్యార్థులు కొర్ర ఆమోస్, జల్లి హర్షవర్దన్, కోరాబు జ్ఞానహర్ష, కొర్ర వంశీ, కొర్ర జేమ్స్, కొర్ర చాణిక్యలను ఓ గదిలోకి పిలిచారు. బాలికలను ఎందుకు టీజ్ చేస్తున్నారంటూ మోకాళ్ల కుర్చీ వేయించారు. సుమారు రెండు గంటలపాటు (అర్ధరాత్రి 12 గంటల వరకు) మోకాళ్లపై ఉంచి, కదిలితే కొట్టారు. అకౌంటెంట్, సోషల్ ఉపాధ్యాయుడు, జేమ్స్ అనే విద్యార్థి తన మెడపై కాలుతో తొక్కారు. అయితే ఈ సంఘటన గురించి బయటకు చెబితే ఉపాధ్యాయులు ఏమిచేస్తారోనన్న భయంతో విద్యార్థులు ఎవరికీ చెప్పలేదు. అయితే సోమవారం పాఠశాలకు వచ్చిన కొంతమంది తల్లిదండ్రులకు ఆయా విద్యార్థులు ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు పాడేరు టీడబ్ల్యూ డీడీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు గురుకులం ఓఎస్డీ పీఎస్ఎన్ మూర్తి, ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి మంగళవారం ఇక్కడకు వచ్చి బాలురు, బాలికలు, ఉపాధ్యాయులను వేర్వేరుగా విచారించారు. నివేదికను ఐటీడీఏ పీవోకి అందజేస్తామని వారు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa