పెందుర్తి నియోజకవర్గంలో కూటమి నేతల కనుసన్నల్లో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఇసుకను ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి అధికారిక ముద్రతో అమ్ముకుంటున్నారు. వీరి వాహనాలను ఎవరూ అడ్డగించకుండా ఉండేందుకు కొందరు అధికారులు ఏకంగా ‘గ్రీన్ ఛానల్’ ఏర్పాటుచేయడం గమనార్హం.ఏ ప్రభుత్వం వచ్చినా నగర శివారు నియోజకవర్గ నాయకులు ఇసుక, మట్టి తవ్వకాలపైనే దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు పెందుర్తిలోను అదే జరుగుతోంది. రాంబిల్లిలో తూర్పు నౌకాదళం నిర్మిస్తున్న ప్రత్యామ్నాయ స్థావరానికి, భోగాపురంలో నిర్మితమవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి మట్టి, ఇసుక పెద్దఎత్తున అవసరం కావడంతో వాటిని సరఫరా చేయడానికి రాజకీయ నాయకులు పోటీ పడుతున్నారు. పెందుర్తి నేతలు అరకు, ఎస్.కోట తదితర ప్రాంతాలలో ఇసుకను తవ్వించి లారీల్లో తెప్పిస్తున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అమ్ముకుంటున్నారు. ఈ లారీలు గమ్యస్థానాలకు వెళ్లేటపుడు మధ్యలో ఎవరూ అడ్డగించకుండా ఉండేందుకు అధికారులతోనే ప్రత్యేకంగా ‘గ్రీన్ ఛానల్’ ఏర్పాటు చేయించుకున్నారు. ఆ లారీలు ఎక్కడ ఎదురైనా స్థానిక అధికారులు ఎవరూ అడ్డగించకూడదని అనధికార ఆదేశాలు కూడా జారీఅయ్యాయి. అదే విధంగా కొండలను, ప్రభుత్వ భూములను తవ్వి ఎర్రమట్టిని తరలించుకుపోతున్నారు. ఇటీవల నియోజకవర్గంలో కొందరు వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరారు. వారు గతంలో మట్టి, ఇసుక అమ్మకాల ద్వారా బాగా లాభపడ్డారు. ఇప్పుడు అవే వ్యాపారాలను నడుపుతున్నారు. వీరికి పోటీగా ఇంకెవరైనా ఇసుక తెచ్చినా, మట్టి తవ్వినా, తరలించినా ఆ వాహనాలను పట్టుకొని కేసులు పెట్టిస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో పంచాయితీలు నడుపుతున్నారు. ఇటువంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అధికారులు సైతం నాయకులకు సహకరించడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa