ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్ నెట్లో ముగ్గురు ఉన్నతాధికారులను వెంటనే తొలగిస్తున్నామని ప్రకటించారు. ఫైబర్ నెట్ బిజినెస్ అండ్ ఆపరేషన్స్ హెడ్ గంధంశెట్టి సురేశ్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్, ఏపీ ఫైబర్ నెట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పప్పూ భరద్వాజ తొలగిస్తున్నట్లు తెలిపారు. ఫైబర్ నెట్ సంస్థలో మొత్తం 410 మందిని తొలగించాలని ఆదేశాలిచ్చినా ఇప్పటి వరకు వారు పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. ఫైబర్ నెట్ ఎండీ, ఈడీలు ఆ 410మంది ఉద్యోగుల తొలగింపు ఆదేశాలపై సంతకాలు చేయలేదని.. ఉద్యోగులకు జీతాల రూపంలో సంస్థ సొమ్ము చెల్లించారని వివరించారు.
తాము నిర్ణయం తీసుకున్నాక అనుమతి ఇచ్చేందుకు జాప్యం ఎందుకు అని ప్రశ్నించారు జీవీరెడ్డి. గతంలో తొలగించిన వారిని ఇంత వరకు విధుల నుంచి తొలగించలేదని.. కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆదేశాలు అమలు చేయడానికి అధికారులకు ఉన్న అభ్యంతరం ఏంటి ఏంటని ప్రశ్నించారు. ఫైబర్ నెట్లోని కొంతమంది ఉన్నతాధికారులు గత ప్రభుత్వంతో చేతులు కలిపారా? అంటూ ప్రశ్నించారు. జీఎస్టీ అధికారులు గత నెలలో ఫైబర్ నెట్కు రూ.377 కోట్లు జరిమానా విధించారని.. అయినా అధికారులు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకురాలేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా ఫైబర్ నెట్లో పురోగతి లేదన్నారు. ఫైబర్ నెట్ సంస్థలో సంస్కరణలు తీసుకురావాలని చూస్తున్నా అధికారులు సహకరించడం లేదని విమర్శించారు. 8 నెలల్లో ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయామని.. రూపాయి కూడా ఆదాయం తీసుకురాలేకపోయామన్నారు.
ఫైబర్ నెట్ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు జీవీ రెడ్డి . 'విధుల్లో అలసత్వం వహించొద్దు.. ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురావాలి' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతున్నారని.. కానీ ఇక్కడ మాత్రం అసలు మొదలే పెట్టలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము తొలగిస్తున్న ముగ్గురు అధికారులు ఏం చేసినా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. గతేడాది డిసెంబర్ 24న తాను 410 మంది ఇర్రెగ్యులర్ ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించిన విషయాన్ని జీవీ రెడ్డి గుర్తు చేశారు.. కానీ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగిని కూడా తొలగిస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆ 410మందికి కోటిన్నర జీతం పని చేయకుండా ఇవ్వాలని.. ఎండీకి వారిని తొలగించడానికి భయమేంటని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఛైర్మన్ జీవీ రెడ్డి ప్రక్షాళన మొదలు పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన 410 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.. గత ప్రభుత్వ హయాంలో పెద్దల ఆదేశాలతో అర్హత లేని వారిని ఉద్యోగులుగా నియమించారని జీవీ రెడ్డి ఆరోపించారు. కొందరు సిబ్బంది గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేశారని విమర్శించారు. వారికి జీతాలు మాత్రం ఫైబర్నెట్ నుంచి చెల్లించి రూ. కోట్లు దుర్వినియోగం చేశారన్నారు. తాము కక్షతో, దురుద్దేశంతో ఉద్యోగులను తొలగించడం లేదని.. ఉద్యోగులకు లీగల్ నోటీసులు ఇచ్చి వివరణ కోరతామని గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే.. ఫైబర్ నెట్లో అవసరాల మేరకు ఉద్యోగులను తీసుకుంటామని కూడా జీవీ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం హయాంలో ఏమాత్రం అర్హతలేని వారిని ఫైబర్నెట్లో ఉద్యోగులుగా నియమించారని ఆరోపించారు. అలాగే వ్యూహం సినిమా విషయంలో కూడా ఫైబర్ నెట్ నుంచి దర్శకుడు రామ్గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa