ఇటీవలే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 2 వారాల తర్వాత కాషాయ దళం ఢిల్లీ ముఖ్యమంత్రి సహా డిప్యూటీ సీఎం, స్పీకర్, మంత్రుల పేర్లను తెలిపింది. నేడు వీరంతా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్గా విజేందర్ గుప్తా ప్రమాణం చేయగా.. అంతా షాక్ అవుతున్నారు.
గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఈయనను.. ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు అసెంబ్లీ నుంచి గెంటేసింది. ఈయన చేసిన ఓ వ్యాఖ్య కారణంగా రచ్చ జరగ్గా మార్షల్స్ చేత ఆయన్ను బలంవంతగా బయటకు పంపించారు. అరడజనుకు పైగా మార్షల్స్.. విజేందర్ గుప్తాను ఎత్తుకుని బయటకు తీసుకు వచ్చారు. అంతటి అవమానం తర్వాత ఆయన స్పీకర్గా మారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతుండంతో బీజేపీ నేతలు సహా, కార్యకర్తలు, మద్దతుదారులు తెగ సంబుర పడిపోతున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
2015 అసెంబ్లీ ఎన్నికల్లో రోహిణి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు విజేందర్ గుప్తా. ఈక్రమంలోనే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాగా.. ఓ గొడవ జరిగింది. ముఖ్యంగా అదే ఏడాది నవంబర్ 30వ తేదీన విజేందర్ గుప్తా.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఓపీ శర్మపై తీవ్ర విమర్శలు చేశారు. దాన్ని నిరసిస్తూ.. ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున రచ్చ చేశారు. విజేందర్ గుప్తాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. స్పీకర్ ఆయన్ను బయటకు వెళ్లమని చెప్పారు.
కానీ అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో మార్షల్స్ను పిలిపించి మరీ విజేందర్ గుప్తాను బలంవంతగా బయటకు పంపించారు. మొత్తంగా ఆరుగురు మార్షల్స్.. ఆయన్ను ఎత్తుకుని మరీ అసెంబ్లీ నుంచి బయటకు తీసుకు వెళ్లారు. ఆపై లోపలికి రానీయకుండా అడ్డుకున్నారు. ఇలా తీవ్ర అవమానం పొంది ఆయన ఇప్పుడు కూడా అదే నియోజక వర్గం నుంచి గెలిచి.. ఏకంగా స్పీకర్ పదవిని పొందారు. అప్పుడు ఆప్ నేతలు బయటకు పంపించినా ఇప్పుడ స్పీకర్గా తానే వెళ్తుండడంతో బీజేపీ నేతలంతా తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై విజేందర్ గుప్తా స్పందిస్తూ.. పార్టీ తనకు స్పీకర్ పదవి కేటాయించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే.. సభలో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరిగేలా చూస్తానన్నారు. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 14 కాగ్ రిపోర్టులు పెండింగ్లో ఉన్నాయని.. వాటిని బయటకు తీసి ఆ పార్టీ నేతల అక్రమాలను వెలుగులోకి తీసుకు వస్తానని అన్నారు. చూడాలి మరి ముందు ముందు ఏం చేయనున్నారనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa