ట్రెండింగ్
Epaper    English    தமிழ்

70 నిమిషాల రూల్ ఆ టోల్ ప్లాజాలకు వర్తించదు.. కేంద్రం కీలక ప్రకటన

business |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2025, 11:16 PM

వాహనదారులకు ఊరట కలిగించే వార్త చెప్పింది కేంద్రం. ఫాస్టాగ్‌కి సంబంధించి ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన కొత్త రూల్స్‌పై క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 17, 2025 నుంచి అమలులోకి వచ్చిన 70 నిమిషాల నిబంధనలు వాహనదారుల్లో గందరగోళానికి దారి తీసిన క్రమంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కీలక ప్రకటన చేసింది. జనవరి 28వ తేదీన ఎన్‌పీసీఐ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజాలకు వర్తించవని స్పష్టం చేసింది. దీంతో వాహనదారులకు భారీ ఊరట లభించడంతో పాటు గందరగోళానికి తెరదించినట్లయింది.


టోల్ ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి 60 నిమిషాల కంటే ఎక్కువ టైం వాహనం ఫాస్టాగ్ ఇనాక్టివ్‌లో ఉండడం, స్కాన్ చేసిన 10 నిమిషాల తర్వాత ఇనాక్టివ్‌లోకి వెళ్లిన సందర్భంగా సదరు ట్రాన్సాక్షన్‌ను తిరస్కరిస్తారంటూ ఎన్‌పీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫాస్టాగ్ ఇనాక్టివ్‌లో ఉండి ట్రాన్సాక్షన్ తిరస్కరణకు గురైన సందర్భంలో డబుల్ టోల్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ క్రమంలో వాహనదారుల్లో గందరగోళం నెలకొంది. అసలు ఈ రూల్ ఏంటో చాలా మందికి అర్థం కాలేదని చెప్పవచ్చు. అయితే వాహనం టోల్ ప్లాజా దాటినప్పుడు ఫాస్టాగ్ స్టేటస్ విషయంలో ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంక్, టోల్ పేమెంట్ అందుకున్న బ్యాంకుల మధ్య ఏర్పడుతున్న వివాదాల పరిష్కారం కోసం ఎన్‌పీసీఐ ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.


అన్ని జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజాలు ఇప్పటికే ఐసీడీ 2.5 ప్రోటోకాల్ పాటిస్తున్నాయని ఎన్‌హెచ్ఏఐ స్పష్టం చేసింది. దీని కింద ఫాస్టాగ్ కస్టమర్లు టోల్ ప్లాజాకు చేరుకునే ముందు ఎప్పుడైనా రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉందని, ఇక్కడ 70 నిమిషాల రూల్ వర్తించదని నొక్కి చెప్పింది. అయితే, ఈ కొత్త రూల్స్ రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలకు వర్తిస్తాయని, రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్ గేట్లు ప్రస్తుతం ఐసీడీ 2.4 ప్రోటో కాల్‌ను పాటిస్తున్నట్లు తెలిపింది. అయితే, వాటిని సైతం ఐసీడీ 2.5 ప్రోటో కాల్‌కి మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపింది.


అయితే టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాహనదారులు తమ ఫాస్టాగ్ వాలెట్‌ను ఆటో మేటిక్‌గా రీఛార్జి చేసుకునేలా యూపీఐ సహా సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్‌తో లింక్ చేసుకోవాలని జాతీయ రహదారుల సంస్థ సూచించింది. రాష్ట్ర రహదారులపై ప్రయాణించే వారికి 70 నిమిషాల రూల్ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఇనాక్టివ్ ఫాస్టాగ్ ఉన్న వారు కచ్చితంగా చెక్ చేసుకుని యాక్టివ్ చేసుకోవాలి. లేదంటే డబుల్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com