ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎఫ్‌బీఐ డెరెక్టర్‌గా ట్రంప్ విధేయుడు కాష్ పటేల్

international |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2025, 09:18 PM

డొనాల్డ్ ట్రంప్‌కి వీర విధేయుడు, భారత సంతతికి చెందిన కాష్ పటేల్ (44) అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థకు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన నియామకంపై సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించగా.. అనుకూలంగా 51, వ్యతిరేకంగా 49 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన నియమాకం అధికారికంగా ధ్రువీకరించినట్టయ్యింది. రిపబ్లికన్‌లకు మెజార్టీ ఉన్న సెనేట్‌లో కాష్ పటేల్ నియమాకంపై ఓటింగ్ చేపట్టారు. అయితే, అనూహ్యంగా ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు పార్టీ విప్ ధిక్కరించి ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. మైనే, అలస్కా సేనేటర్లు సుశాన్ కొలిన్స్, లీసా ముర్కోస్కీలు పటేల్‌ నియమాకాన్ని వ్యతిరేకించారు.


అటు, ప్రతిపక్ష డెమొక్రాట్లు కూడా కాష్ నియమాకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కుట్రలను ప్రోత్సహించడం, క్యాపిటల్ హిల్‌పై దాడికి పాల్పడిన ట్రంప్ మద్దతురాలను సమర్థించడం, రిపబ్లికన్ అధ్యక్షుడిని వ్యతిరేకించేవారిపై వివాదాస్పద ప్రకటనలు చేయడం వంటి అంశాలపై పటేల్ డెమొక్రాట్ల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకూ ట్రంప్ చేపట్టిన అన్ని క్యాబినెట్ నియామకాలను సెనేట్ ఆమోదించింది.


ఇక, పటేల్ నియమకాన్ని చివరి వరకూ డెమొక్రాట్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాషింగ్టన్ డీసీలోని ఎఫ్బీఐ కార్యాలయం వద్ద డెమొక్రాట్ సెనేటర్ డిక్ డర్బిన్ మీడియా సమావేశం నిర్వహించి.. కాష్‌ను చీఫ్‌గా నియమిస్తే రాజకీయ, జాతీయ భద్రతకు విపత్తుగా మారుతారని దుయ్యబట్టారు. ఆయన ప్రమాదకరమైన వేర్పాటువాది అని ఆరోపించారు. ‘తన రాజకీయ శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి దేశ అత్యున్నత చట్ట అమలు సంస్థను వాడుకోవాలనే తన ఉద్దేశాన్ని ఆయన పదే పదే వ్యక్తం చేశారు’ అని డిక్ ధ్వజమెత్తారు.


ఎవరీ కాష్ పటేల్ 


భారత్‌లోని గుజరాతీ మూలాలున్న కాష్ పటేల్ పూర్వీకులు తూర్పు ఆఫ్రికాలోని ఉంగడా నుంచి కెనడాకు, అటు నుంచి అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు. గుజరాతీ భారతీయ దంపతులకు 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో కశ్యప్ జన్మించారు. తండ్రి ఏవియేషన్ కంపెనీలో ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేశారు. యూనివర్శిటీ ఆఫ్‌ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి.. యూనివర్శిటీ కాలేజ్‌ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రతిష్ఠాత్మక లా సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమై.. మియామీ కోర్టుల్లో పబ్లిక్‌ డిఫెండర్‌గా పనిచేసి వివిధ హోదాల్లో సేవలందించారు.


కీలక కేసులను వాదించిన కశ్యప్ అలియాస్ కాష్.. కొన్నాళ్లు న్యాయశాఖలో చేరారు. అప్పుడే ఆయన ట్రంప్‌‌ దృష్టిలో పడ్డారు. ట్రంప్‌నకు సన్నిహితుడైన రెప్.డెవిడ్ నూన్స్ నేతృత్వంలోని ఇంటెలిజెన్స్‌ కమిటీలో సిబ్బందిగా 2019లో నియమితులయ్యారు. మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు జాతీయ భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక సలహాదారుగా, తన చివరి పదవీ కాలంలో తాత్కాలిక రక్షణ కార్యదర్శికి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేశారు. డిఫెన్స్ అటార్నీ, ఫెడరల్ ప్రాసిక్యూటర్‌, నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఇలా పలు విధులు నిర్వహించారు. ఐఎస్, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థలకు చెందిన అల్ బగ్దాదీ, ఖాసెమ్ అల్ రిమి వంటి అగ్రనాయకత్వాన్ని నిర్మూలించడం, అనేక మంది బందీలను విడిపించడం సహా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రధాన మిషన్లను కశ్యప్ అమలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa