ఛాంపియన్స్ ట్రోఫీ-2025ని టీమిండియా శుభారంభంతో ప్రారంభించింది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు సునాయాస విజయాన్ని అందుకుంది. మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో కమ్ బ్యాక్ ఇవ్వగా శుభమన్ గిల్ సెంచరీతో దూకుడు పెంచాడు. రోహిత్ శర్మ 36 బంతుల్లో 41 పరుగులు చేయగా, విరాట్ కోహ్లి 38 బంతుల్లో కేవలం 22 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. మ్యాచ్ అనంతరం టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్కు కఠిన సవాళ్లు ఎదురవుతాయని కుంబ్లే చెప్పాడు. భారత జట్టులో మార్పులు చేసే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించాడు. సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ విషయంలో కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ చెప్పాడు.
"టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్కి ఇది చాలా కీలక టోర్నీ. ఈ టోర్నీ ముగిసిన తర్వాత అతని ముందు చాలా సవాళ్లు ఉంటాయి.. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టోర్నమెంట్తో సీనియర్ల భవిష్యత్ కూడా తేలిపోనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా.. ఓడినా జట్టులో మార్పులు ఖాయం. టోర్నీ ముగిసిన వెంటనే వన్డే వరల్డ్కప్ 2027కి జట్టుని సిద్ధం చేయాలి. ఈసారి యువకులతో కూడిన జట్టును సిద్ధం చేయాల్సి ఉంటుంది. వన్డేలకు అలవాటు పడాలంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అవసరం" అని కుంబ్లే చెప్పాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత సీనియర్లను జట్టులో కొనసాగించాలా? లేక యువకులకు అవకాశం ఇవ్వాలా? అనేది మేనేజ్మెంట్ నిర్ణయమని కోహ్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కోచ్గా గంభీర్కు ఈ విషయంలో క్లారిటీ ఉండాలని చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 టీమ్ చాలా బాగుందని, వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్కప్కు పర్ఫెక్ట్ టీమ్ రెడీ అయిందని చెప్పాడు. వన్డే వరల్డ్కప్కు మరో రెండేళ్ల సమయం ఉండటంతో సీనియర్లను తొలగిస్తే ఆలోగా యువకులను సిద్ధం చేయాలని గంభీర్కు కుంబ్లే సలహా ఇచ్చాడు.
టీ20 వరల్డ్కప్లో ఛాంపియన్స్గా నిలిచిన అనంతరం సీనియర్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్, విరాట్ మిగతా ఫార్మాట్లకు కూడా గుడ్ బై చెప్పాలంటూ ఇప్పటికే మాజీలు సూచనలు కూడా చేస్తున్నారు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత్ పేలవ ప్రదర్శన అనంతరం వాళ్లపై ప్రజర్ ఇంకాస్త పెరిగింది. రిటైర్మెంట్ విషయమై రోహిత్ స్పందిస్తూ తాను ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలో తనకు తెలుసంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa