ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాండ్యా ఉండుంటే గిల్ సెంచరీ కష్టమే,,హార్దిక్‌పై నెట్టింట ట్రోలింగ్..

sports |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2025, 09:23 PM

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లోనే టీమిండియా అదరగొట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఈజీ విక్టరీ అందుకుని రెండు పాయింట్లను తన జేబులో వేసుకుంది. శుభమన్ గిల్-కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా విజయాన్ని అందించారు. అయితే మ్యాచ్ ముగిసిన ఒక రోజు తర్వాత హార్దిక్ పాండ్యాపై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. హార్దిక్ ఉండుంటే గిల్ సెంచరీ చేసేవాడే కాదంటూ నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.


బంగ్లాదేశ్ ఇచ్చిన 229 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా చాలా కూల్‌గా ఛేజ్ చేసింది. ఓపెనర్లు శుభమన్ గిల్, రోహిత్ శర్మ పవర్ ప్లేలో అనవసర షాట్లకు వెళ్లకుండా తొలి పది ఓవర్లలోనే 69 పరుగులు జోడించారు. కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత స్కోర్ 41 పరుగుల వద్ద బౌండరీకి ప్రయత్నించి క్యాచ్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లి, శ్రేయాస్, అక్షర్ వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు.


కేఎల్ రాహుల్-శుభమన్ గిల్ కలిసి మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని ఛేదించారు. గిల్, రాహుల్ కలిసి 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీమిండియా ప్రిన్స్ శుభమన్ గిల్ సెంచరీ చేయగా, రాహుల్ 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఒకానొక దశలో శుభమన్ గిల్ సెంచరీ చేయడం కోసం రాహుల్ సింగిల్స్ తీస్తూ గిల్‌కు స్ట్రయికింగ్ ఇస్తూ వచ్చాడు. గిల్ శతకం కోసం తన హాఫ్ సెంచరీని కూడా త్యాగం చేశాడు.


అయితే రాహుల్ స్థానంలో హార్దిక్ పాండ్యా ఉండుంటే ఇలా చేసి ఉండేవాడు కాదంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగారు. హార్దిక్ క్రీజులో ఉండుంటే గిల్ సెంచరీ చేసేవాడు కాదని.. తానే హాఫ్ సెంచరీ చేసుకునే వాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. గిల్‌కి స్ట్రయికింగ్ ఇవ్వకుండా బౌండరీలతో గిల్ సెంచరీ చేయకముందే మ్యాచ్‌ని ముగించేవాడని పోస్టులు చేస్తున్నారు.


వెస్టిండీస్‌తో 2023లో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌ని నెటిజన్లు గుర్తు చేశారు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 17.5 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 83 పరుగులు చేయగా, తిలక్ వర్మ 49, హార్దిక్ 20 పరుగులు చేశారు. అయితే ఇంకా 2.1 ఓవర్లు మిగులున్నా కూడా తిలక్ వర్మను హాఫ్ సెంచరీ చేయనీయకుండా హార్దిక్ సిక్సర్ బాది మ్యాచ్‌ని ముగించాడు.


ఆ సమయంలో తిలక్ వర్మతో సహా టీమిండియా ప్లేయర్లు, ఫ్యాన్స్ అందరూ అయోమయానికి గురయ్యారు. కొత్త కుర్రాడు తిలక్ వర్మను హాఫ్ సెంచరీ చేయనీయకుండా హార్దిక్ చేసిన తీరుపై మండిపడ్డారు. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పాండ్యాని విపరీతంగా ట్రోల్ చేశారు. అలాంటి సందర్భమే భారత్-బంగ్లా మ్యాచ్‌లో రావడంతో నెటిజన్లు హార్దిక్‌ను గుర్తు చేసుకుని మళ్లీ ట్రోల్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa